తక్కువ ధరలో ఎల్‌ఈడీ టీవీలు: గూగుల్‌తో డిక్సన్‌ జోడీ

6 Sep, 2022 10:08 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీలో ఉన్న డిక్సన్‌ టెక్నాలజీస్‌ తాజాగా అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా  స్థానికంగా ఆండ్రాయిడ్, గూగుల్‌ టీవీ ప్లాట్‌ఫామ్స్‌పై ఎల్‌ఈడీ టీవీలను డిక్సన్‌ తయారు చేయనుంది. స్మార్ట్‌ టీవీల కోసం ఆన్‌డ్రాయిడ్, గూగుల్‌ టీవీ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ను గూగుల్‌ అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. 

తక్కువ ఖర్చుతో కూడిన స్మార్ట్ టీవీని అందించడంతోపాటు, ఎల్‌ఈడీ టీవీ విభాగంలో దాని మార్కెట్‌ లీడర్‌షిప్‌ను మరింత బలోపేతం చేసుకోవాడనాఇకి ఇది సహాయ పడుతుందని డిక్సన్ టెక్నాలజీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆండ్రాయిడ్, గూగుల్‌ టీవీలకై భారత్‌లో సబ్‌ లైసెన్సింగ్‌ హక్కులను పొందిన తొలి ఒప్పంద తయారీ కంపెనీ తామేనని డిక్సన్‌ ప్రకటించింది. ఎల్‌ఈడీ టీవీల తయారీలో దేశంలో అతిపెద్ద సంస్థ అయిన డిక్సన్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 60 లక్షల యూనిట్లు. ఈ భాగస్వామ్యం కారణంగా ఎల్‌ఈడీల ఉత్పత్తిలో కంపెనీ సామర్థ్యం మరింత బలపడుతుందని సంస్థ వివరించింది. వాషింగ్‌ మెషీన్లు, ఎల్‌ఈడీ బల్బులు, ఎల్‌ఈడీ బ్యాటెన్స్, మొబైల్‌ ఫోన్స్, సీసీటీవీల వంటి ఉత్పత్తులను సైతం ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది.     

మరిన్ని వార్తలు