సాక్షి మనీ మంత్ర: ఆరంభం నుంచి నష్టాల్లో ట్రేడయిన దేశీయ మార్కెట్‌ సూచీలు

19 Oct, 2023 16:06 IST|Sakshi

దేశీయ స్టాక్ మార్కెట్లు  గురువారం  ప్రారంభం నుంచి మార్కెట్‌ ముగిసే వరకు నష్టాల్లోనే పయనించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 247 పాయింట్లు నష్టపోయి 65629 వద్ద.. నిఫ్టీ 46.4 పాయింట్లను కోల్పోయి  19624 వద్ద ముగిశాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 134 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ  34.55 పాయింట్లు నష్టపోయాయి. 

హమాస్ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు ఆలోచిస్తున్న వేళ మధ్యప్రాచ్య దేశాల్లో యుద్ధ భయాలు మార్కెట్లను నష్టాల్లో పయనించేలా చేశాయి. ఈ తరుణంలో మార్కెట్లలో అనిశ్చితులు కొనసాగుతున్నాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ, కార్పొరేట్ క్యూ2 ఫలితాలు, పెరుగుతున్న యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్‌లు వల్ల ఫెడ్ వడ్డీ రేట్లు పెంచొచ్చనే ఊహాగానాలు ఆందోళనలకు కారణమౌతున్నాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 సూచీలో నెస్లే 3.4శాతం, ఆల్‌ట్రా టెక్‌ సిమెంట్‌ 2.8శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.9శాతం, ఎల్‌ అండ్‌ టీ 0.2శాతం లాభాల్లో ముగిశాయి. విప్రో 3 శాతం, సన్‌ఫార్మా 1.5శాతం, టెక్‌ మహీంద్రా 1.4శాతం, ఎన్‌టీపీసీ 1.3శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 1.1శాతం, భారతీఎయిర్‌టెల్‌ 1 శాతంమేర నష్టాల్లో ట్రేడయ్యాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు