గోల్డ్‌ రిసీట్స్‌లో ట్రేడింగ్‌కు లైన్‌ క్లియర్‌

27 Sep, 2022 07:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్‌ రూపంలో గోల్డ్‌ రీసీట్స్‌ (ఈజీఆర్‌)ను తన ప్లాట్‌ఫామ్‌పై ప్రారంభించేందుకు సెబీ నుంచి తుది అనుమతి లభించినట్టు బీఎస్‌ఈ సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఇందుకు సంబంధించి సెబీకి సూత్రప్రాయ ఆమోదం రాగా, ఎన్నో విడతలుగా ఈజీఆర్‌ ట్రేడింగ్‌లో మాక్‌ టెస్టింగ్‌ కూడా నిర్వహించింది. వ్యక్తిగత ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు సహా ఎవరైనా బీఎస్‌ఈ ఈజీఆర్‌లలో లావాదేవీలు నిర్వహించుకోవడానికి అవకాశం అందుబాటులోకి రానుంది.

తుది ఆమోదం మంజూరు చేసినందుకు సెబీకి బీఎస్‌ఈ ధన్యవాదాలు తెలియజేసింది. త్వరలోనే వీటిని ప్రారంభిస్తామని బీఎస్‌ఈ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ సమీర్‌ పాటిల్‌ తెలిపారు. ఈజీఆర్‌ ప్లాట్‌ఫామ్‌ వల్ల బంగారం సరఫరాలో గొప్ప నాణ్యతకు దారితీస్తుందన్నారు. అలాగే, న్యాయమైన ధరలు, లావాదేవీల్లో పారదర్శకత ఉంటుందన్నారు. అన్ని డిపాజిటరీలు, వోల్ట్‌లతో సంప్రదింపులు చేస్తున్నామని, ఈజీఆర్‌ ట్రేడ్‌కు కావాల్సిన ఎకోసిస్టమ్‌ అభివృద్ధికి పనిచేస్తున్నట్ట బీఎస్‌ఈ ప్రకటించింది. మన దేశం ఏటా 800–900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసకుంటూ, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. 

చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్!

మరిన్ని వార్తలు