బంగారం- వెండి.. 4 రోజుల నష్టాలకు చెక్‌

7 Sep, 2020 10:07 IST|Sakshi

ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 50,777కు

ఎంసీఎక్స్‌లో కేజీ వెండి రూ. 68,020 వద్ద ట్రేడింగ్‌

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1941 డాలర్లకు

27.22 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి

ఇటీవల ఆటుపోట్ల మధ్య డీలా పడిన పసిడి, వెండి ధరలు ప్రస్తుతం స్వల్పంగా పుంజుకున్నాయి. వెరసి నాలుగు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. అటు న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ లాభాలతో కదులుతున్నాయి. వివరాలు ఇలా..  

హుషారుగా..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 99 లాభపడి రూ. 50,777 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 754 ఎగసి రూ. 68,020 వద్ద కదులుతోంది. తొలుత రూ. 68,398 వరకూ పెరిగింది.

అటూఇటుగా..
శుక్రవారం వరుసగా నాలుగో రోజు పసిడి ధరలు వెనకడుగు వేశాయి. అయితే వెండి మాత్రం పుంజుకుంది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి నామమాత్రంగా రూ. 64 క్షీణించి రూ. 50,678 వద్ద ముగిసింది. తొలుత 51,082 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,362 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 340 బలపడి రూ. 67,266 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 67,910 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 66,225 వరకూ నీరసించింది. 

కామెక్స్‌లో వెండి జోరు‌..
ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) బంగారం 0.4 శాతం బలపడి 1,941 డాలర్లకు చేరింది. స్పాట్‌ మార్కెట్లో నామమాత్ర వృద్ధితో  1935 డాలర్ల వద్ద కదులుతోంది.  వెండి మరింత అధికంగా ఔన్స్ 2 శాతం జంప్‌చేసి 27.22 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

నాలుగో రోజూ..
విదేశీ మార్కెట్లో శుక్రవారం వరుసగా నాలుగో రోజు పసిడి బలహీనపడింది. న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) బంగారం 0.2 శాతం తక్కువగా 1,934 డాలర్ల వద్ద ముగిసింది. అయితే స్పాట్‌ మార్కెట్లో 0.2 శాతం పుంజుకుని 1934 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇక వెండి ఔన్స్ 0.6 శాతం క్షీణించి 26.71 డాలర్ల వద్ద నిలిచింది. ఆగస్ట్‌ నెల మొదట్లో చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. పసిడి, వెండి ధరలు రెండు రోజులు బలపడితే.. రెండు రోజులు బలహీనపడుతున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు