India-Pakistan Match: 70 బిరియానీలు ఆర్డర్‌ చేసిన కుటుంబం

14 Oct, 2023 22:15 IST|Sakshi

క్రికెట్‌కు భారత్‌లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే ఆ క్రేజ్‌ మరింత ఎక్కువగా ఉంటుంది. అభిమానులు పనులన్నీ మానుకుని మరీ టీవీలకు అతక్కుపోతారు. టాస్‌ దగ్గర నుంచి మ్యాచ్‌ చివరి బాల్‌ వరకూ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తారు.

ప్రస్తుతం భారత్‌లో క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్‌ 14న భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా చంఢీగడ్‌లో ఓ కుటుంబం ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీలో ఏకంగా 70 బిరియానీలు ఆర్డర్‌ పెట్టింది.ఈ విషయాన్ని తెలియజేస్తూ స్విగ్గీ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో ఒక పోస్టు పెట్టింది. దీనిపై యూజర్లు పలు రకాలుగా కామెంట్లు పెట్టారు.

కాగా ఈ మ్యాచ్‌లో భారత్‌.. పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 191 ఆలౌట్‌ అయింది. తర్వాత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 30.3 ఓవర్లలలోనే లక్ష్యాన్ని చేధించింది. 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. 

గతంలో ఆసియా కప్‌లో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరిగినప్పుడు కూడా బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఇలాగే 62 బిరియానీలు ఆర్డర్‌ పెట్టింది.
 

మరిన్ని వార్తలు