బీమా క్లెయిం తిరస్కరించడంతో ఎల్ఐసికి రూ.15.5 లక్షల జరిమానా

26 Jul, 2021 17:45 IST|Sakshi

హైదరాబాద్: కె.రాములు అనే వృద్దుడు తన మైనర్ మనవరాళ్ల తరఫున బీమా క్లెయిం తిరస్కరణకు సంబందించి ఎల్ఐసి వ్యతిరేకంగా గతంలో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించిన తీర్పును వినియోగదారుల ఫోరం జూలై 25న వెల్లడించింది. క్లెయింను తిరస్కరణకు సంబంధించి సరైన సమాచారాన్ని వెల్లడించకుండా వారి వాదనలను తిరస్కరించినందుకు ఫిర్యాదుదారుడికి రూ.15.5 లక్షలు చెల్లించాలని ఎల్ఐసిని జిల్లా వినియోగదారుల ఫోరం ఆదివారం ఆదేశించింది. 

తన కుమారుడు జీవన్ ఆనంద్ కింద రూ.5 లక్షల బీమా కవరేజీ, న్యూ బీమా గోల్డ్ కింద రూ.10 లక్షల బీమా కవరేజీపాలసీని 2012లో తీసుకున్నట్లు పిర్యాదులో కె.రాములు పేర్కొన్నాడు. అయితే, తన కుమారుడి మరణం తర్వాత మైనర్ మనవరాళ్ల తరఫున వారి తాత రాములు జూలై 6, 2012న ఎల్ఐసికి బీమా క్లెయింను సమర్పించారు. 'మృతుడు తన ఆరోగ్యానికి సంబంధించిన సరైన సమాచారాన్ని వెల్లడించకుండా, ప్రస్తుత పాలసీని తీసుకునేటప్పుడు తన మునుపటి పాలసీల గురుంచి తెలపడంలో విఫలమయ్యాడు' అనే కారణంతో బీమా క్లెయింను తిరస్కరించింది.

పిర్యాదులో పేర్కొన్న ప్రకారం మరణించిన వ్యక్తి తన పాలసీలో కేవలం ఒక విషయం గురుంచి మాత్రమే ప్రకటించలేదని బెంచ్ తెలిపింది. జూన్ 13, 2012 నాటి డిశ్చార్జ్ సారాంశం ప్రకారం, బీమా చేసిన వ్యక్తి గత ఆరు నెలలుగా దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడని, అయితే ఈ పాలసీని జూలై 27, 2011న తీసుకున్నట్లు ధర్మాసనం గుర్తించింది. "ఫిర్యాదుదారుడు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను అణచివేసినట్లు రికార్డులో ఏమీ లేదు" అని బెంచ్ తెలిపింది. జిల్లా వినియోగదారుల ఫోరం 9% వడ్డీతో పాటు బీమా మొత్తాన్ని చెల్లించాలని ఎల్ఐసిని ఆదేశించింది. అలాగే పరిహారంతో పాటు ఫిర్యాదుదారుడికి కోర్టు ఖర్చుల కింద రూ.5,000 చెల్లించాలని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు