144 పాయింట్ల నష్టంతో 43,449 వద్ద సెన్సెక్స్
33 పాయింట్లు తక్కువగా 12,716 వద్ద నిఫ్టీ ట్రేడింగ్
ఆటో, ఐటీ, ఫార్మా రంగాలు ప్లస్- బ్యాంక్స్ డౌన్
బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం ప్లస్
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ల సూపర్ ర్యాలీకి బ్రేక్ పడింది. ట్రేడర్లు అమ్మకాలకు తెరతీయడంతో వెనకడుగుతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 144 పాయింట్లు క్షీణించి 43,449కు చేరగా.. నిఫ్టీ 33 పాయింట్లు తక్కువగా 12,716 వద్ద ట్రేడవుతోంది. బుధవారం యూఎస్ మార్కెట్లలో ఎస్అండ్పీ, నాస్డాక్ లాభపడ్డాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ట్రెండ్ కనిపిస్తోంది. కాగా.. తొలుత సెన్సెక్స్ 43,544 వద్ద గరిష్టాన్ని తాకగా.. 43,291 దిగువన కనిష్టాన్ని చేరింది. నిఫ్టీ సైతం 12,741- 12,692 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.
ఫార్మా, ఆటో, ఐటీ అప్
ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఫార్మా, ఆటో, ఐటీ రంగాలు 1 శాతం స్థాయిలో పుంజుకోగా.. బ్యాంకింగ్ 1.2 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్, కొటక్ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ 3.3-1 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, శ్రీసిమెంట్, హిందాల్కో, హెచ్సీఎల్ టెక్, టైటన్, టెక్ మహీంద్రా, హెచ్యూఎల్, విప్రో, ఎయిర్టెల్ 2.4-0.8 శాతం మధ్య బలపడ్డాయి.
అరబిందో ప్లస్
డెరివేటివ్ కౌంటర్లలో అరబిందో, ఐబీ హౌసింగ్, బాలకృష్ణ, ఎస్కార్ట్స్, ఇన్ఫ్రాటెల్, జూబిలెంట్ ఫుడ్, అదానీ ఎంటర్ప్రైజెస్, నౌకరీ, కేడిలా 4-1.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క అపోలో హాస్పిటల్స్, మెక్డోవెల్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, ఆర్ఈసీ, బీవోబీ, బంధన్ బ్యాంక్ 2.6-1 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,019 లాభపడగా.. 697 నష్టాలతో కదులుతున్నాయి.
ఎఫ్పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 6,207 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 3,464 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 5,627 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. అయితే డీఐఐలు రూ. 2,309 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.