-

ఓలా ఎలక్ట్రిక్ సంచ‌న‌లం.. దేశంలో మరో భారీ ప్లాంట్ నిర్మాణం!

24 Feb, 2022 19:33 IST|Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మన దేశంలో మరో భారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్దం అవుతుంది. సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ మద్దతు గల ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాన్ని 50 గిగావాట్(జీడబ్ల్యుహెచ్) సామర్థ్యంతో నిర్మించాలని యోచిస్తోంది. 10 మిలియన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేయడానికి ఓలాకు 40 జీడబ్ల్యుహెచ్ బ్యాటరీ సామర్థ్యం అవసరం. అలాగే, మిగతా 10 జీడబ్ల్యుహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం వినియోగించుకోవాలని భావిస్తుంది.

2023 నాటికి 1 జీడబ్ల్యుహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసి, రాబోయే 3-4 సంవత్సరాల్లో 20 జీడబ్ల్యుహెచ్'కు విస్తరించాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే, ఇందుకోసం $1 బిలియన్ వరకు పెట్టుబడి అవసరం. ప్రస్తుతం దక్షిణ కొరియా నుంచి బ్యాటరీ సెల్స్'ను దిగుమతి చేసుకునే ఓలా అధునాతన సెల్ బ్యాటరీ టెక్నాలజీ ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోందని ఒక కంపెనీ అధికారి తెలిపారు. ఇంకా భారతదేశంలో బ్యాటరీ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆ అధికారి పేర్కొన్నారు. 

టెస్లా ఇంక్(టిఎస్ ఎల్ ఎ) వంటి ప్రధాన గ్లోబల్ ఆటోమేకర్లకు సరఫరా చేసే సీఏటీఎల్, ఎల్ జి ఎనర్జీ సొల్యూషన్స్, పానాసోనిక్ (6752.టి)తో సహా కొన్ని ఆసియా కంపెనీలు ప్రస్తుతం బ్యాటరీ సెల్ తయారీపై ఆధిపత్యం వహిస్తున్నాయి. దేశ చమురు దిగుమతిలను తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడానికి కంపెనీలు స్థానికంగా గ్రీన్ ఎనర్జీ వాహనాలు, బ్యాటరీలను తయారు చేయలని కేంద్రం కోరుతోంది. ఇందుకోసం 6 బిలియన్ డాలర్ల వరకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.  ఓలా ప్రస్తుతం రోజుకు సుమారు 1,000 స్కూటర్లను ఉత్పత్తి చేస్తోంది. 

(చదవండి: ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లోకి హోండా ఈవీ స్కూటర్ వచ్చేది అప్పుడే..!)

మరిన్ని వార్తలు