పేటీఎం చెల్లింపులు ఇక మరింత భద్రం

6 May, 2022 17:58 IST|Sakshi

2.8 కోట్ల కార్డుల టోకెనైజేషన్‌ మా ప్లాట్‌ఫామ్‌పై 80 శాతం కార్డులకు పూర్తి  ప్రకటించిన పేటీఎం  

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల సేవల్లోని వన్‌97 కమ్యూనికేష న్స్‌ (పేటీఎం) జూన్‌ 30 నాటికి వీసా, మాస్టర్‌ కార్డ్, రూపేకు సంబంధించి 2.8 కోట్ల కార్డుల టోకెనైజేషన్‌ను తన ప్లాట్‌ఫామ్‌పై పూర్తి చేసినట్టు ప్రకటించింది. పేటీఎం యాప్‌పై యాక్టివ్‌గా ఉన్న కార్డుల్లో 80 శాతం కార్డుల టోకెనైజేషన్‌ ముగిసినట్టు తెలిపింది. చెల్లింపుల వ్యవస్థ మరింత భద్రంగా, సురక్షితంగా చేసే లక్ష్యంతో తీసుకొచ్చిందే టోకెనైజేషన్‌. ఈ విధానంలో అసలైన కార్డు వివరాలను ప్రత్యామ్నాయ రీడింగ్‌ కోడ్‌ (దీన్నే టోకెన్‌గా పిలుస్తున్నారు)తో భర్తీ చేస్తారు. అసలైన కార్డు వివరాలతో లావాదేవీలు జరగవు కనుక మోసాలకు అవకాశం ఉండదు. పీవోఎస్‌లు, క్యూఆర్‌ కోడ్‌ చెల్లింపులు ఈ టోకెనైజేషన్‌ విధానంలో జరుగుతున్నాయి.

కార్డు, టోకెన్‌ కోసం అభ్యర్థించిన సంస్థ (మర్చంట్‌), గుర్తింపు డివైజ్‌ (మర్చంట్‌లు వినియోగించే) కలగలసి ఈ కోడ్‌ ఉంటుంది. దీన్నే టోకెనైజేషన్‌గా పేర్కొంటారు. ‘‘సురక్షిత, భద్రతతో కూడిన ఆన్‌లైన్‌ చెల్లింపులకు పేటీఎం కట్టుబడి ఉంది. ఈ దిశగా ఆర్‌బీఐ తీసుకొచ్చిన టోకెనైజేషన్‌ అన్నది పరిశ్రమకు కీలకమైన మైలురాయి వంటిది. కార్డులను టోకెనైజేజ్‌ చేయాల్సిన అవసరాన్ని గుర్తించి, పేటీఎం యాప్‌పై అమ లు చేశాం’’అని పేటీఎం సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ ప్రకటన విడుదల చేశారు.   

చదవండి: ష్‌.. చెప్తే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు: ఆనంద్‌ మహీంద్రా

మరిన్ని వార్తలు