ఓటీపీ నమోదు చేస్తేనే డబ్బులు!

17 Sep, 2020 15:32 IST|Sakshi

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఏటీఎంలో నగదు ఉపసంహరణకు కొత్త నిబంధన రేపటి నుంచి అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్‌బీఐ ఏటీఎంలలో శుక్రవారం నుంచి ఓటీపీ ఆధారిత విత్‌డ్రాయల్ సిస్టమ్ అమలులోకి రానుంది. ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి న‌గ‌దు తీసుకోవాలంటే తప్పనిసరిగా వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌(ఓటీపీ) ఎంట‌ర్ చేయాల్సిందే. ఈ నెల 18 నుంచి రోజులో అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) 10 వేలు రూపాయలు అంతకుమించి చేసే నగదు ఉపసంహరణలకు పిన్‌ నంబర్‌తోపాటు ఓటీపీ నమోదు చేయాల్సి ఉంటుంది. డెబిట్‌ కార్డుకు లింక్‌ చేసిన ఉన్న రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేస్తేనే ఏటీఎంలో నుంచి నగదు వస్తుంది. ఓటీపీ లేకపోతే 10 వేల రూపాయలకు మించి న‌గ‌దు తీసుకోలేరు. 

ప్రస్తుతానికి రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల మధ్య ఎస్‌బీఐ ఏటీఎంల్లో రూ.10వేలకు మించి చేసే ఉపసంహరణలకు వినియోగదారుల మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఇవ్వడం తప్పనిసరిగా అమల్లో ఉంది. రాత్రి వేళల్లో మోసాలకు తావు లేకుండా ఉండే ఉద్దేశ్యంతో ఈ ఏడాది జనవరిలో ఈ సదుపాయాన్ని ఎస్‌బీఐ తీసుకొచ్చింది. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) ఈ నిబంధనను అమలు చేయాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. (చదవండి: పెట్రో ధరలు : మూడో రోజూ ఊరట)

మరిన్ని వార్తలు