ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిసాయి. నిన్నటి దెబ్బకి ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు కొద్దీ సేపు లాభాల్లో కొనసాగి తర్వాత ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం తీవ్ర ఊగిసలాట ధోరణి కనబరిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ఫలితాలు మార్కెట్లకు అండగా నిలిస్తే.. దేశీయంగా కరోనా కేసుల విజృంభణ, కఠిన ఆంక్షల అమలు సూచీలను కలవరపాటుకు గురిచేశాయి. చివరికి సెన్సెక్స్ 42.07 పాయింట్లు (0.09 శాతం) లాభపడి పెరిగి 49,201.39 వద్ద ముగియగా, నిఫ్టీ 45.70 పాయింట్లు (0.31 శాతం) పైకి ఎగిసి 14,683.50 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.38 వద్ద ముగిసింది.
పారిశ్రామిక, మౌలిక, ఎఫ్ఎంసీజీ, స్థిరాస్తి, లోహ, టెలికాం రంగాల షేర్లు లాభాల్లో పయనించగా.. బ్యాంకింగ్, పీఎస్యూ, ఇంధన రంగం షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ 50లో అదానీ పోర్ట్స్ షేర్లు ఏకంగా 12.57 శాతం ఎగిశాయి. టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల షేర్లు లాభపడితే పవర్గ్రిడ్, ఐషర్ మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్ని చవిచూశాయి.