Ex-Twitter employee: ఆఫీస్‌లో నేలపై పడుకుని అప్పట్లో వైరల్‌! అంతలా కష్టపడినా వేటు తప్పలేదు..

4 Mar, 2023 21:37 IST|Sakshi

టెక్‌ కంపెనీల్లో లేఆఫ్స్‌ ఎవ్వరినీ వదలడం లేదు. ఎంత సీనియర్‌ ఉద్యోగి అయినా.. కంపెనీ కోసం ఎంతలా కష్టపడి పనిచేసినా ఉద్వాసన తప్పడం లేదు. డెడ్‌లైన్స్‌ను చేరుకునేందుకు ట్విటర్‌లో ఓ సీనియర్‌ ఉద్యోగిని ఆఫీస్‌లోనే నేలపై నిద్రించిన ఫొటో గతేడాది వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఉద్యోగం కోల్పోయారు.

కంపెనీ ప్రధాన కార్యాలయంలో నేలపై పడుకుని వైరల్‌ మారిన ట్విటర్‌ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎస్తేర్ క్రాఫోర్డ్ ఇటీవలి తొలగింపుల్లో ఉద్వాసనకు గురయ్యారు. ఆమె ట్విటర్‌ ద్వారా తన భావోద్వేగాలను పంచుకున్నారు. కంపెనీ కోసం ఎంత పనిచేసినా చివరికి ఉద్వాసన తప్పలేదని, యాజమాన్యం ఎప్పటికీ కుటుంబం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మన పని మాత్రమే కావాలని నిట్టూర్చారు. 

అయితే లేఆఫ్స్‌ తర్వాత కంపెనీలో మిగిలిపోయిన ఉద్యోగుల పట్ల ఆమె సానుభూతి వ్యక్తం చేశారు. వారికి మరింత పని భారం తప్పదన్నారు. ఏదేమైనా యాజమాన్యం ఎప్పటికీ కుటుంబం కాలేదని, మీరు కంపెనీ కోసం ఎంతలా కష్టపడినా కంపెనీ అవసరాలు మారినప్పుడు అవేమీ పట్టించుకోదని చెప్పారు. మన చేతుల్లో ఏమీ ఉండదని, ఇలాంటివి జరిగినప్పుడే స్మార్ట్‌గా పని చేయడం వంటి కొత్త పాఠాలు నేర్చుకోవచ్చని సూచించారు.

చదవండి: Google Bard: గూగుల్‌ బార్డ్‌ అంటే సెర్చ్‌ మాత్రమే కాదు.. అంతకు మించి.. 

తొలగింపునకు ముందు వరకు క్రాఫోర్డ్ ట్విటర్‌ పెయిడ్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ బాధ్యతలు నిర్వహించారు.  2022 అక్టోబర్‌లో ట్విటర్‌ను ఎలాన్ మస్క్ స్వాధీనం చేసుకున్నాక అందులో ఇది ఎనిమిదో రౌండ్ ఉద్యోగాల కోత.

చదవండి: ఈ-మెయిల్‌ యాప్‌ను బ్లాక్‌ చేసిన యాపిల్‌.. కారణం ఇదే..

మరిన్ని వార్తలు