వివాహేతర సంబంధం: నమ్మించి లాడ్జికి తీసుకువెళ్లి..

20 Nov, 2021 11:16 IST|Sakshi

సాక్షి, ఏలూరు టౌన్‌( పశ్చిమ గోదావరి): అనుమానం పెనుభూతంలా మారడంతో వివాహితను ఆమె ప్రియుడు గొంతు బిగించి హతమార్చాడు. మృతదేహాన్ని గోనె సంచులో చుట్టి కాలువ గట్టుపై పడేశాడు. ఈనెల 13న జరిగిన హత్య ఘటనలో నిందితుడిని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్‌ చేశారు. ఏలూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ దిలీప్‌కిరణ్‌ శుక్రవారం వివరాలు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడెంకు చెందిన పులిపాకల శిరీష భర్త మరణించడంతో ఒంటరిగా జీవిస్తోంది.

ఆమెకు పెదవేగి మండలం నాగన్నగూడెంకు చెందిన జిజ్జువరపు సుబ్బారావుతో పరిచయమైంది. సుబ్బారావు కొబ్బరితోటల్లో కూలీగా పనిచేస్తూ ఆమెతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఆమె వేరే వ్యక్తితో మాట్లాడుతున్నట్టు తెలుసుకున్న సుబ్బా రావు అనుమానం పెంచుకున్నాడు. రెండు నెలల క్రితం వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఆమెను హతమార్చాలని పథకం రచించాడు. ఈ క్రమంలో ఈనెల 13న ఆమెను మోటారు సైకిల్‌ ఎక్కించుకుని జంగారెడ్డిగూడెంలో ఓ లాడ్జికి తీసుకువెళ్లాడు.

వెనుక నుంచి ఒక్కసారిగా ఆమె మెడను తువాలుతో బిగించి చంపేశాడు. గోనె సంచిలో మృతదేహాన్ని కట్టి పెదవేగి మండలం లక్ష్మీపురం శివారు పోలవరం కుడికాలువ గట్టు మట్టి దిబ్బలపై పడేసి ఉడాయించాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పెదవేగి ఎస్సై టి.సుధీర్‌కుమార్‌ దర్యాప్తు ప్రారంభించారు. ఏలూ రు రూరల్‌ ఇన్‌చార్జి సీఐ డీవీ రమణ ఆధ్వర్యంలో కేసును చేధించి నిందితుడు సుబ్బారావును అరెస్ట్‌ చేశారు. చాకచక్యంగా వ్యవహరించిన రూరల్‌ ఎస్సై ఎన్‌. లక్ష్మణబాబు, పెదవేగి సిబ్బంది బి.ఏసోబు, సీహెచ్‌.సుధీర్, రామచంద్రరావు, వెంకటేశ్వరరావును డీఎస్పీ అభినందించారు.

చదవండి: మృత్యుంజయడు.. ఆరు గంటల పాటు వరద ఉధృతిలో,చుట్టూ పాములు..

>
మరిన్ని వార్తలు