అమ్మాయి ఫోటో చూసి ఇష్టపడ్డాడు.. రిజక్ట్‌ చేయడంతో కాల్‌ గర్ల్‌ అని..

24 Dec, 2021 08:55 IST|Sakshi
మహిళను వేధించిన కేసులో నిందితుడి అరెస్ట్‌  

సాక్షి, హైదరాబాద్‌: నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌ సృష్టించి దాని ద్వారా ఓ యువతికి, ఆమె తల్లికి అసభ్యకరమైన సందేశాలు, వీడియోలను పంపిస్తూ వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ కేవీ విజయ్‌ కుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లాకు చెందిన తిరుకోవెల అక్షిత్‌ కౌండిన్య విద్యార్థి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అమ్మాయి ప్రొఫైల్‌ను చూశాడు. ఆమె ఫొటో చూసి ప్రేమను పెంచుకున్నాడు. ఆపై ఆమెకు తరచు మెసేజ్‌లు పంపేవాడు.  దీంతో  ఆమె కౌండిన్య ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌ను బ్లాక్‌ చేసింది.

దీనిని తట్టుకోలేకపోయిన నిందితుడు ఆమెపై పగ పెంచుకున్న అతను ఆమె ప్రొఫైల్‌ ఫొటోతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెరిచాడు. దీని ద్వారా పలువురికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపించాడు. ఆమె కాల్‌ గర్ల్‌ అని, రకరకాల అసభ్యకర కామెంట్లు పెట్టేవాడు. దీనిని గుర్తించిన బాధితురాలు ఇన్‌స్టాగ్రామ్‌కు రిపోర్ట్‌ చేసి తన పేరుతో ఉన్న నకిలీ ఐడీని బ్లాక్‌ చేయించింది. దీంతో నిందితుడు మరోసారి ఆమె ఫొటోను వినియోగించి రెండు నకిలీ ఖాతాలను సృష్టించాడు. మరోమారు అసభ్యకరమైన సందేశాలను పోస్ట్‌ చేశాడు.
చదవండి: న్యూఇయర్‌ టార్గెట్‌: గ్రాము ‘కొకైన్‌’ ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

ఈసారి బాధితురాలు, ఆమె తల్లి ఫోన్‌ నంబర్లను సంపాదించాడు. వర్చువల్‌ నంబర్లతో వాట్సాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి అసభ్యకరమైన మెసేజ్‌లు, వీడియోలను పంపించాడు. తనకు వీడియో కాల్స్‌ చేయాలని లేకపోతే మార్ఫింగ్‌ చేసిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు గురువారం నిందితున్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 
చదవండి: ఆన్‌లైన్‌లో పరిచయం.. నీ కష్టాలు తీరుస్తా.. వ్యక్తిగత ఫొటోలు, రూ.5 వేలు పంపు..

మరిన్ని వార్తలు