అనుమానిత ఉగ్రవాది బెంగళూరులో అరెస్టు

12 Feb, 2023 03:15 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి బెంగళూరులో అరెస్టయ్యాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), బెంగళూరు పోలీసులు కలిసి చేపట్టిన ఆపరేషన్‌లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన మహ్మద్‌ ఆరీఫ్‌ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో థణిసంద్రలోని ఓఇంట్లో ఉన్న ఇతడిని అరెస్ట్‌ చేశారు. ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న అరీఫ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

రెండేళ్లుగా ఉగ్ర సంస్థ అల్‌ఖైదాతో టెలీగ్రాం, డార్క్‌నెట్‌ ద్వారా సంబంధాలు నెరుపుతున్నట్లు తెలిసింది. ఇతడి కదలికలపై ఎన్‌ఐఏ కొన్ని రోజులుగా నిఘా ఉంచింది. సిరియా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న ఆరీఫ్‌ను పట్టుకుని, ఒక లాప్‌టాప్, రెండు హార్డ్‌ డిస్కులను స్వాధీనం చేసుకుంది. ఈ నెల 13న బెంగళూరులోని ఇంటిని ఖాళీ చేసి యూపీకి వెళ్తున్నట్టు ఇతడు ఇంటి యజమానికి చెప్పాడని పోలీసులు వివరించారు. గత నవంబర్‌లో శివమొగ్గలో ఐఎస్‌ ప్రేరేపిత ఉగ్ర మాడ్యూల్‌ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు