కిరోసిన్‌ పోసి.. నిప్పంటించి..

14 May, 2021 08:03 IST|Sakshi
హతురాలు ఇందిర (పాతచిత్రం)   

ఇంట్లో నిద్రిస్తున్న మహిళ హత్య

గుర్తు తెలియని దుండగుల ఘాతుకం

వేమగిరిలో దారుణం  

కడియం(తూర్పుగోదావరి): భర్త, కుమారుడు ఉద్యోగానికి వెళ్లారు. కోడలు పై అంతస్తులో నిద్రిస్తోంది. అర్ధరాత్రి దాటిన ఆ సమయంలో తన ఇంట్లోని మొదటి అంతస్తు వరండాలో నిద్రిస్తున్న ఒక మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్‌ పోసి, నిప్పంటించిన దారుణ ఘటన కడియం మండలం వేమగిరిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వేమగిరి ముత్యాలమ్మ దిబ్బ వీధిలో కరిబండ ఇందిర (53) అనే మహిళ భర్త సత్యనారాయణ, కుమారుడు కొండలరావు, కోడలు పుష్పతో కలిసి నివాసం ఉంటోంది. ఇందిర భర్త, కుమారుడు హార్లిక్స్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగులు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో నైట్‌ డ్యూటీకి వెళ్లారు. పై అంతస్తులో కోడలు పుష్ప, మొదటి అంతస్తులోని వరండాలో ఇందిర నిద్రపోతున్నారు.

అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నిద్రలో ఉన్న ఇందిరపై గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ఇందిర మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె కుమారుడు కొండలరావు ఫిర్యాదు మేరకు కడియం ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీధర్‌కుమార్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా ప్రాంతాన్ని డాగ్‌స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌లు పరిశీలించి ఆధారాలు సేకరించాయి. ఇందిర హత్యపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. బయటి వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడ్డారా లేక కుటుంబంలో ఏమైనా తగాదాలున్నాయా తదితర అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న హతురాలి కోడలు పుష్పను కూడా ప్రత్యేకంగా విచారిస్తున్నారు.

వేమగిరిలో వరుస హత్యలు
మండలంలోని మేజర్‌ పంచాయతీల్లో ఒకటైన వేమగిరి గ్రామం వరుస హత్యలతో బెంబేలెత్తుతోంది. ఐదు రోజుల వ్యవధిలోనే ఈ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హత్యకు గురికావడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. ఒక పక్క కోవిడ్‌ కారణంగా ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తోందని గ్రామస్తులు గుండెలు చేత్తో పట్టుకుని ఉంటుండగా, ఈ హత్య ఘటనలను తీవ్రంగా కలవర పరుస్తున్నాయి. ఈ నెల 9వ తేదీన వివాహేతర సంబంధం నేపథ్యంలో వేమగిరితోట సమీపంలో బొంతు వెంకన్న అనే 45 సంవత్సరాల వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనలో నిందితుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి గురువారం నిందితుడు పితాని సత్తిబాబును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఈ ఘటన మరువక ముందే ముత్యాలమ్మదిబ్బ ప్రాంతానికి చెందిన కరిబండ ఇందిర అనే 53 ఏళ్ల మహిళను గుర్తు తెలియన వ్యక్తులు కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టారు. రెండంతస్తుల భవనంలో మొదటి అంతస్తులోని వరండాలో నిద్రిస్తున్న ఇందిరపై గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పైఅంతస్తులో ఆమె కోడలు పుష్ప నిద్రిస్తోండగా ఈ దారుణం జరిగింది. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. బొంతు వెంకన్నను పదునైన ఆయుధంతో నరకడంతో అతడు ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. నిద్రపోతున్న ఇందిరపై కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టడంతో తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.

చదవండి: ఘోర ప్రమాదం: పోలీసులపై దూసుకెళ్లిన లారీ  
ఆత్మహత్య: ఇంట్లో భార్య.. జైల్లో భర్త.. 

మరిన్ని వార్తలు