ఆహారాలు ప్లాస్టిక్‌ బౌల్‌లో వద్దు!

6 Jun, 2021 10:39 IST|Sakshi

ఇటీవల మనం అందంగా కనిపించే ప్లాస్టిక్‌ బౌల్స్‌లో ఆహారాలను వడ్డించడం అలవాటు చేసుకున్నాం. అయితే పైకి అందంగా కనిపించే ఈ బౌల్స్‌ ఆరోగ్యం విషయానికి వస్తే అంత మంచివి కాదు. ఈ బౌల్స్‌ ‘మెలమెన్‌’ అనే ప్లాస్టిక్‌లతో  తయారవుతాయి. వేడి వేడి కూరలు, పులుసులు ఇందులోకి తీయగానే ఆ వేడికి ప్లాస్టిక్‌లో మెలమైన్‌... ఆహారంతో పాటు శరీరంలోకి వెళ్తుంది. దేహంలోకి వెళ్లిన ఈ పదార్థం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉందని ‘జామా ఇంటర్నల్‌ మెడిసిన్‌’ జర్నల్‌లోనూ ప్రచురితమైంది. ఈ అధ్యయనంలో భాగంగా కొంతమందికి మెలమైన్‌ బౌల్స్‌లో నూడుల్స్‌ ఇచ్చారు.

మరికొందరికి పింగాణీ బౌల్స్‌లో ఇచ్చారు. ఈ రెండు గ్రూపుల వారికి నిర్వహించిన మూత్ర పరీక్షల్లో మెలమైన్‌ బౌల్స్‌లో తిన్న వారి మూత్రంలో మెలమైన్‌ పాళ్లు దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఫలితంగా వారిలో కిడ్నీఫెయిల్యూర్‌కు దారితీసే అవకాశంతోపాటు క్యాన్సర్‌ ప్రమాదమూ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. మెలమైన్‌ బౌల్‌లో ఉంచి ఏ ఆహారాన్నీ మైక్రోవేవ్‌ ఒవెన్‌లో వేడిచేయకూడదు. ఈ అంశాన్ని అమెరికన్‌ ప్రమాణాల సంస్థ ఎఫ్‌డీఏ కూడా గట్టిగానే సిఫార్సు చేస్తోంది. ఈ ప్లాస్టిక్‌ ప్రభావం మహిళల్లోని ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌పై ఉంటుంది.

దీనివల్ల  గర్భధారణ సమస్యలు రావచ్చు. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గవచ్చు. చాలామందిలో డయాబెటిస్‌ రిస్క్‌ పెరుగుతున్నట్లుగా మరో అధ్యయనంలో తేలింది. రొమ్ము క్యాన్సర్‌ వంటి క్యాన్సర్‌ రిస్క్‌లు చాలా ఎక్కువ. ప్లాస్టిక్‌ బౌల్స్‌లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీన పడి జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్‌ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అలై్జమర్స్‌ వంటి వ్యాధులు కూడా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. 
అందుకే కూరలు, పులుసులకు ప్లాస్టిక్‌ బౌల్స్‌ కాకుండా పింగాణీ బౌల్స్‌ వాడటం మేలని నిపుణులు చెబుతున్నారు.
చదవండి: కరోనా సెకండ్‌ వేవ్‌: ఆడవాళ్లు ఈ ఆహారం తీసుకోవాలి!

మరిన్ని వార్తలు