Know About Dengue Fever: ఆ దోమల వల్ల డెంగ్యూ.. ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగులు

14 Sep, 2023 14:17 IST|Sakshi

వర్షాకాలం సీజన్‌ కావడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా వంటి జ్వరాలతో హాస్పిటల్స్‌లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. సాధారణ జ్వరంలాగే వచ్చే ఈ ఫీవర్ లక్షణాలు త్వరగా బయటపడవు. ఆరోగ్యంగానే కనిపిస్తారు.

కానీ రోజులు గడిచే కొద్దీ వారిలో డెంగ్యూ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. సరైన సమయంలో చికిత్స తీసుకుంటేనే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. అసలు డెంగ్యూ ఎలా వస్తుంది? దాని లక్షణాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. 


డెంగ్యూ ఎలా వస్తుంది?

డెంగ్యూ దోమల వల్ల వస్తుంది. ఇది ఏడిస్ ఏజిప్టి అనే  ఆడదోమల కారణంగా వ్యాపిస్తుంది.ఈ దోమలు చికెన్‌గున్యా, యెల్లో ఫీవర్, జికా వైరస్‌లకు సైతం వాహకాలుగా పనిచేస్తాయి. పగలు కుట్టే దోమలతోనే ఈ వ్యాధి సంక్రమిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. క్రమంగా వైరస్‌ తీవ్రత ఎక్కువై జ్వరం పెరుగుతుంది. దీంతో పాటు ఇతర లక్షణాలు కూడా మనకు కనిపిస్తాయి. తీవ్రత పెరిగే కొద్దీ ఫ్లూ లక్షణాలు బయటపడతాయి. డెంగ్యూ వైరస్‌లో నాలుగు సెరోటైప్స్‌ ఉన్నాయి. వీటిని DENV-1, DENV-2, DENV-3, DENV-4 అని పిలుస్తారు. మన దేశంలో DENV-2 కారణంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. 


ఈ లక్షణాలు కనబడితే జాగ్రత్తపడండి..

వర్షాకాలం మొదలైన జూన్‌, జులై మాసంలో ప్రారంభమయ్యే విషజ్వరాల తాకిడి ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ కొనసాగుతుంది. డెంగ్యూ వచ్చిన వారిలో సహజంగానే 3 నుంచి 5 రోజుల వరకు ఆ లక్షణాలు కనిపించవు. మరికొందరిలో మాత్రం జ్వరం వచ్చిన వెంటనే లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.


► డెంగ్యూ  వచ్చిన వారికి 104 ఫారెన్‌హీట్ డిగ్రీల జ్వరం ఉంటుంది. అలాగే తలనొప్పి, కండరాలు, ఎముకలు, కీళ్ల నొప్పులు ఉంటాయి.
► వికారం, వాంతులు మరో ప్రధాన లక్షణం. కళ్లు మండటం, వికారం, వాంతులు,తీవ్రమైన కడుపునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, విసుగు  డెంగ్యూ జ్వరం లక్షణాలు. 

► డెంగ్యూ జ్వరం ఉంటే శరీరంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. డెంగ్యూ జ్వరానికి నిర్దిష్టమైన చికిత్స అంటూ లేదు. అందుకే ఈ లక్షణాలను బట్టి ఎప్పటికప్పుడు చికిత్స చేయించుకోవాలి. ప్లేట్‌లెట్స్ సంఖ్య 20 వేల కంటే పడిపోతే ప్రమాదకర స్థాయిలో ఉందని అర్ధం. ఈ పరిస్థితుల్లో తక్షణం ప్లేట్‌లెట్స్ ఎక్కించుకోవల్సి వస్తుంది. డెంగ్యూ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం.  

డెంగ్యూ జ్వరాన్ని తగ్గించే ఆహారాలు

  • డెంగ్యూ వచ్చిన  జీర్ణమయ్యే ఆహారాన్నే తీసుకోవాలి. ముఖ్యంగా పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలి. 
  • డెంగ్యూ జ్వరంతో బాధపడతున్నవారు బొప్పాయి పండ్లు లేదా ఆ మొక్క ఆకుల రసాన్ని స్వల్ప మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తంలో ప్లేట్‌లెట్స్‌ పెరిగి త్వరగా కోలుకుంటారు. 
  • ఆరెంజ్‌ జ్యూస్‌ రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.నారింజలో విటమిన్‌-సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. 
  • డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో కొబ్బరి నీళ్లు ముఖ్యపాత్ర పోషిస్తుంది. డెంగ్యూ జ్వరం అటాక్‌ చేస్తే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అందుకే కొబ్బరినీళ్లను ఎక్కువగా తీసుకుంటే బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. ఇందులో ఖనిజాలు, ఎలక్ట్రోరోలైట్లు ఇందులో అధికంగా ఉంటాయి.
  • ప్రతిరోజు ఓ కివి పండు తినడం వల్ల ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పెరుగుతుంది. కివి జ్యూస్‌ తాగినా మంచి ఫలితం ఉంటుంది. 
  • పాలకూరలో విటమిన్‌-ఇ ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే పాలకూరలోని పోషకాలు డెంగ్యూ జ్వరాన్ని నివారించడంలో సహాయపడుతుంది. 
  • వీట్‌ గ్రాస్‌ డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ జ్యూస్‌ తాగడం వల్ల ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ పెరుగుతుంది. తద్వారా జ్వరం తగ్గుతుంది. 

మరిన్ని వార్తలు