అమెరికా సెనేటర్‌ ‘తైవాన్‌’ టూర్‌.. చైనా స్ట్రాంగ్‌ వార్నింగ్‌

27 Aug, 2022 10:47 IST|Sakshi

బీజింగ్‌: అమెరికా సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ.. తైవాన్‌ పర్యటనతో మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అధికారిక పర్యాటనలను కొనసాగిస్తోంది అమెరికా. దీంతో మరోమారు స్ట్రాగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది డ్రాగన్‌. అమెరికా చట్టసభ్యుడు మార్షా బ్లాక్‌బర్న్.. తైవాన్‌లో పర్యటించటాన్ని తీవ్రంగా ఖండించింది. తైవాన్‌తో అన్నిరకాల అధికారిక పరస్పర చర్యలను ఆపాలని హెచ్చరించింది. రిపబ్లికన్ సెనేటర్‌ మార్షా బ్లాక్‌బర్న్‌ ఆగస్టు 25-27 వరకు తైపీ పర్యటన చేపట్టారు. 

‘ఈ పర్యటన ఒకే చైనా పాలసీ నిబంధనలను, అమెరికా-చైనా మధ్య మూడు ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. అలాగే.. తైవాన్‌తో అనధికారిక సంబంధాలు మాత్రమే కొనసాగిస్తామన్న అమెరికా అంగీకారానికి వ్యతిరేకంగా ఉంది. ప్రపంచంలో చైనా ఒక్కటే ఉంది. చైనా భూభాగంలో తైవాన్‌ అంతర్భాగం. చైనా మొత్తానికి పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా ప్రభుత్వానికే అధికారం ఉంటుంది.’ అని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి. తైవాన్‌ స్వాతంత్య్రం, వేర్పాటువాదం, విదేశీ శక్తుల జోక్యాన్ని వ్యతిరేకించటంలో వెనకడుగువేయబోమన్నారు. ఒకే చైనా పాలసీ, చైనా-అమెరికా ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని అమెరికా రాజకీయ నేతలకు విన్నవిస్తున్నామని తెలిపారు.

మరోవైపు.. తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు చైనా వేచి చూస్తోందని ఆరోపించారు అమెరికా సెనేటర్‌ మార్షా బ్లాక్‌బర్న్‌. ఫిజీ పర్యటన ముగించుకుని గత గురువారం రాత్రి తైపీకి చేరుకున్నారు. పపువా న్యూ గనియా, ఫిజీ, తైవాన్‌లకు అమెరికా దౌత్యమద్దతును మరోస్థాయికి తీసుకెళ్లేందుకే ఈ పర్యటన సాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో తైవాన్‌ జాతీయ భద్రతా మండలి అధినేతతో సమావేశం కానున్నారు.

ఇదీ చదవండి: తైవాన్‌లో పెరుగుతున్న టెన్షన్‌... ఉక్రెయిన్‌లా పోరు సాగించలేం

మరిన్ని వార్తలు