కిడ్నాప్‌ నాటకంతో డబ్బులు కాజేయాలనుకుంది..కానీ చివరికీ ఆ భార్య..

7 Apr, 2023 07:40 IST|Sakshi

ఒక అమాయక భర్తకి మీ భార్య కిడ్నాప్‌ అ‍య్యిందంటూ ఓ అపరిచిత వ్యక్తి నుంచి కాల్‌ వచ్చింది. ఆమెను వదిలేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. లేదంటే చిత్రహింసలకు గురిచేస్తాం అని కూడా బెదిరించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించిన ఆ వ్యక్తికి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. కేసును విచారించిన పోలీసులు సైతం నివ్వెరపోయారు. చివరికి అతడి భార్యను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ అనూహ్య ఘటన దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే.. దక్షిణాఫ్రికాలోని 47 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన మహిళ ఫిరోజా బీ బీ జోసెఫ్ తాను కిడ్నాప్‌ అయ్యినట్లు నాటకం ఆడింది. అందుకోసం తన భర్తకి ఒక అపరిచిత వ్యక్తి చేత ఫోన్‌ చేయించి..మీ భార్యను కిడ్నాప్‌ చేశామని, వదిలేయాలంటే పెద్దమొత్తంలో డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేయించింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. ఇంతలో మరుసటి రోజు కూడా డబ్బుల తొందరగా ఇ‍వ్వకపోతే గనుక ఆమెను చిత్రహింసలకు గురి చేస్తాం అని మరోసారి సదరు వ్యక్తి నుంచి కాల్‌ వచ్చింది ఆమె భర్తకు.

దీంతో పోలీసులు ఆ ఫోన్‌ కాల్స్‌ని ట్రేస్‌ చేసి ఆ దిశగా దర్యాప్తు సాగించగా.. అసలు విషయం బయటపడింది. అతడి భార్‌య జోసఫ్‌ పీటర్‌మారిట్జ్‌బర్గ్‌ నగరంలోని ఒక హోటల్‌ల గదిలో ఉంటున్నట్లు తేలింది. అలాగే కిడ్నాపర్లు దొంగలించారన్న ఆభరణాలన్ని కూడా ఆమె అధీనంలోనే ఉన్నట్లు వెల్లడైంది. అలాగే ఆమె ఆ హోటల్‌లో బస చేసినట్లు సీసీఫుటేజ్‌ల ఆధారంగా గుర్తించారు. అక్కడ ఆమె వేరే పేరుతో లగ్జరీగా నివశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కిడ్నాప్‌ నాటకంతో భర్త నుంచి డబ్బులు కాజేయాలనుకుని చివరికి కటకటాలపాలైంది. 

(చదవండి: అతని జీవితం నాశనం అయ్యింది.. భారతీయుడికి రూ.11 కోట్లు చెల్లించాలని ఆదేశం)

మరిన్ని వార్తలు