విజయం దిశగా మహింద రాజపక్స

7 Aug, 2020 04:44 IST|Sakshi
మహింద రాజపక్స

కొలంబో: శ్రీలంక రాజకీయాల్లో మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని అయిన మహింద రాజపక్స మరోసారి కీలకంగా మారనున్నారు. ఆయన నేతృత్వం వహిస్తున్న శ్రీలంక పొదుజన పెరుమణ(ఎస్‌ఎల్‌పీపీ) పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు అధికారికంగా ఫలితాలు వెలువడిన 16 సీట్లకుగాను 13 చోట్ల 60 శాతం పైగా ఓట్లు సాధించింది.

తమిళులు మెజారిటీ సంఖ్యలో ఉన్న ఉత్తర ప్రాంతంలో కూడా ఎస్‌ఎల్‌పీపీ అభ్యర్థులే విజయం దిశగా సాగిపోతున్నారు. మొత్తం 22 జిల్లాలకుగాను 17 జిల్లాల్లో ఎస్‌ఎల్‌పీపీ తిరుగులేని ఆధిక్యం సంపాదించినట్లు అనధికార ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 225 సీట్లున్న అసెంబ్లీలో ఎస్‌ఎల్‌పీపీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ గెలుపు అధికార పార్టీ సాధించిన అద్భుత విజయమని మహింద సోదరుడు, శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స పేర్కొన్నారు.

ఈ గెలుపుపై మహింద రాజపక్సకు భారత ప్రధాని మోదీ ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్‌–19 భయం పొంచి ఉన్నప్పటికీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారనీ, ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారని అభినందించారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించుకునేందుకు, ప్రత్యేకమైన అనుబంధాన్ని ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు ఈ ఫలితాలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. భారత ప్రధానికి మహింద రాజపక్స కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంక, భారత్‌లు స్నేహితులు, బంధువులు కూడా అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు