శివాజీనగర: దళిత వర్గానికి చెందిన నాయకులు సుదాందాస్, డాక్టర్ గోపాల్, అంబణ్ణ, హెణ్ణూరు శ్రీనివాస్ మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దళిత పోరాటంలో నిమగ్నమైన నలుగురు నాయకులు నగరంలోని క్వీన్స్ రోడ్డులో ఉన్న కేపీసీసీ కార్యాలయంలో వీరికి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్సింగ్ సుర్జెవాలా పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఆ తరువాత మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాన్ని అత్యంత గౌరవంగా నడచుకునే కార్యాన్ని కాంగ్రెస్ చేపట్టింది. వీరి హక్కుల కోసం తాము నిరంతరం పోరాడుతూ వస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ నుంచి ఎంతో లబ్ధి జరిగిందన్నారు. బొమ్మై ప్రభుత్వంలో దళితులకు మోసం జరిగింది. అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ పెంచనున్నట్లు వెల్లడించారు. అయితే ఇంతవరకు పెంచే విషయమై ఎలాంటి ప్రతిపాదన రాలేదని పార్లమెంటులో కేంద్ర మంత్రియే తెలియజేశారని చెప్పారు.
బొమ్మై రాజీనామా చేయాలి:
కనీసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించకుండా ఒక సముదాయానికి పెద్ద మోసం చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ,, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్కుమార్ కటీల దళితులకు తీరని ద్రోహం చేశారని అన్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహించి సీఎం తన పదవికి రాజీనామా చేయాలని రణదీప్ సింగ్ సుర్జెవాలా డిమాండ్ చేశారు. మాజీ డీసీఎం జీ.పరమేశ్వర్ మాట్లాడుతూ... దళితుల సమస్యలపై అనేక పోరాటాలను చేపడుతూ వస్తున్నామని తెలిపారు.