ఢిల్లీ: రైతులు, రోజువారి కూలీల ఆత్మహత్యలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి.) సంచలన విషయాలను బయటపెట్టింది. దేశంలో ప్రతి రోజు 154 మంది రైతులు, రోజువారి కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నారని నివేదిక పేర్కొంది. ఆత్మహత్య చేసుకుంటున్నవారిలో కుటుంబ సమస్యలు, అనారోగ్యం వల్లే అత్యధికంగా మరణిస్తున్నారని వెల్లడించింది. 2021లో ఈ సంఖ్య 144గా ఉంది. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి.) ఏటా దేశంలో జరిగే నేరాలపై ఇచ్చే వార్షిక నివేదికను 2022 సంవత్సరానికి విడుదల చేసింది.
మొత్తం ఆత్మహత్యల్లో వ్యవసాయ రంగంలో పనిచేసేవారు 6.6 శాతం కాగా.. రోజువారి కూలీలు 26.4 శాతం మేర ఉన్నారు. అంటే 2022 ఏడాదికి మొత్తం 1,70,924 మంది ఆత్మహత్య చేసుకోగా.. అందులో రోజువారి కూలీలే 44,713 మంది ఉన్నారు. ఇందులో మగవారి సంఖ్య 41,433 కాగా స్త్రీల సంఖ్య 3,752గా ఉంది. 2021లో ఆత్మహత్య చేసుకున్న రోజువారి కూలీలు 25.6 శాతంగా ఉన్నారు. 2022 నివేదిక ప్రకారం ఆత్మహత్యలు చేసుకున్న స్వయం ఉపాధి, వృత్తి నిపుణులు 9.6 శాతంగా ఉన్నారు. ఇందులో 14,395 మంది ఉద్యోగులు కాగా , 18,357 మంది స్వయం ఉపాధి వ్యక్తులు బాధితులుగా నమోదయ్యారు. 2022 ఏడాదికి మొత్తం ఆత్మహత్యల్లో నిరుద్యోగులు 9.2 శాతంగా ఉన్నారు. ఇందులో 12000 మంది విద్యార్థులు కూడా ఉన్నారు.
ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2022 సంవత్సరానికి దేశంలో మొత్తం 1,70,924 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 2021లో ఈ సంఖ్య 1,64,033గా ఉంది. 2021తో పోల్చితే 2022లో దాదాపు 4% మేరకు ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు(7,8776) మహారాష్ట్ర(6,275), మధ్యప్రదేశ్(5,371) తెలంగాణ(4,513) ముందు వరుసలో నిలిచాయి.
ఇదీ చదవండి: National Crime Records Bureau: అయినా భర్త మారలేదు