అమెజాన్ మేనేజర్ హత్య.. 18 ఏళ్ల యువకుడి 'మాయా గ్యాంగ్‌' వెలుగులోకి..

31 Aug, 2023 13:58 IST|Sakshi

ఢిల్లీ: అమెజాన్ మేనేజర్ హత్యా ఉదంతంలో భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మేనేజర్ హర్‌ప్రీత్‌ గిల్‌ను హత్య చేసింది కేవలం 18 ఏళ్ల వడిలో అడుగుపెట్టిన ఓ యువకుడి నాయకత్వంలోని మాయా గ్యాంగ్ పనేనని పోలీసులు గుర్తించారు. నిందితులు ఇప్పటికే పలు కేసుల్లో నేరస్థులుగా ఉన్నట్లు తెలిపారు. 

మహమ్మద్ సమీర్(18).. నాలుగు మర్డర్ కేసుల్లో బాల్యనేరస్థునిగా శిక్షను అనుభవిస్తున్నాడు. అతని ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లోనూ తుపాకీలకు పోజులిస్తూ, కాల్చడం వంటి ఫొటోలు ఉన్నాయి. అమెజాన్ మేనేజర్ హర్‌ప్రీత్‌ను హత్యచేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 

ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన ఇద్దరిలో ఒకరు సమీర్‌ కాగా.. మరొకరు 18 ఏళ్ల బిలాల్ గని. గని గతేడాది హత్య, దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని చిల్డ్రన్స్ అబ్జర్వేషన్ హోమ్‌కు పంపారు. కాని బయటకు వచ్చి వెల్డింగ్ షాప్‌లో పని చేస్తున్నాడు.

అమెజాన్ మేనేజర్ హత్య..
ఢిల్లీకి చెందిన హర్‌ప్రీత్‌ గిల్‌ అనే 36 ఏళ్ల వ్యక్తి అమెజాన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటలకు తన మేనమామ గోవింద్‌తో కలిసి సుభాష్‌ విహార్‌లోని ఇరుకైన సందులో‌ బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారికి ద్విచక్ర వాహనాలపై వచ్చిన కొంతమంది యువకులు ఎదురయ్యారు. ఇరుకైన సందులో ట్రాఫిక్ సమస్యపై వచ్చిన గొడవలో నిందితులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు గమనించి బాధితులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. హర్‌ప్రీత్‌ గిల్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మేనమామ గోవింద్‌కు చికిత్స అందిస్తున్నారు. 

ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు వెళ్లడించారు. 

ఇదీ చదవండి: ఢిల్లీలో ఘోరం.. అమెజాన్‌ మేనేజర్‌ దారుణ హత్య..


 

మరిన్ని వార్తలు