Farmers Protest: 8 నెలలు పూర్తి.. నేడు ‘మహిళా కిసాన్‌ సంసద్‌’

26 Jul, 2021 09:56 IST|Sakshi

రైతుల నిరసనకు నేటితో 8 నెలల పూర్తి

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు దేశ రాజధానిలో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్‌ 26న ప్రారంభమైన రైతుల ఆందోళనలకు నేటితో 8 నెలలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రైతుల దీక్షకు మద్దతుగా మహిళా రైతులు సోమవారం జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన తెలపనున్నారు. కిసాన్‌ సంసద్‌ పేరిట మహిళా రైతులు ఆందోళన చేపట్టనున్నారు. 

ఈ క్రమంలో కిసాన్‌ సంయుక్త మోర్చా ఓ ప్రకటన విడుదల చేసింది. మహిళా రైతులకు చెందిన పలు కాన్వాయ్‌లు సోమవారం ఢిల్లీ సరిహద్దులకు చేరుకుని.. మహిళా కిసాన్‌ సంసద్‌ పేరిట నిరసన తెలుపుతారు అని పేర్కొంది. భారతీయ వ్యవసాయ రంగంలో మహిళా రైతు పాత్రను ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రపంచానికి తెలియజేస్తాం అని ప్రకటనలో పేర్కొన్నారు. 

పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా రైతులు జంతర్‌ మంతర్‌ వద్ది కిసాన్‌ పార్లమెంటు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు 200 మంది రైతుల పార్లమెంటు వెలుపల కూర్చుని నిరనస తెలుపుతారు. పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిద్ధూ రైతుల ఉద్యమం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 

మరిన్ని వార్తలు