మదరసాలలో దేశ వ్యతిరేక కార్యకలాపాలా? ఊరుకోం.. కూల్చేస్తాం: అస్సాం సీఎం స్ట్రాంగ్‌ వార్నింగ్‌

1 Sep, 2022 19:57 IST|Sakshi

గౌహతి: అస్సాంలో మదరసాల కూల్చివేత వ్యవహారం ఇటు రాజకీయంగా, అటు మతపరంగా పెను దుమారం రేపుతోంది. అయినా సరే ‘తగ్గేదేలే’ అంటున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు నెలవైన ఏ ఒక్క మదరసాను కూల్చేయకుండా వదిలే ప్రసక్తే లేదని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారాయన. 

మదరసాలను కూల్చేయాలన్నది మా అభిమతం, ఉద్దేశం కాదు. జిహాదీ శక్తులు వాటిని ఉపయోగిస్తున్నాయా? లేదా? అని పరిశీలించడమే మా పని. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాటిని ఉపయోగిస్తున్నారని,  సంబంధాలు ఉన్నాయని తేలితే చాలూ.. వాటిని కూల్చివేసి తీరతాం.  ఈ విషయంలో బుల్డోజర్లు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు అని ఆయన గురువారం మరోసారి సీఎం హిమంత బిస్వా శర్మ స్పష్టం చేశారు. 

ఇదిలా ఉంటే.. అనుమానిత, ఉగ్ర‌సంస్థ‌ల‌తో సంబంధాలున్న మదర్సాలపై అస్సాం సర్కార్ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. ప్ర‌త్యేక డ్రైవ్‌లతో వాటిని కూల్చేస్తోంది. తాజాగా బొంగైగావ్ జిల్లా కబితరీ గ్రామంలోని  మార్క్‌జుల్ మా-ఆరిఫ్ క్వారియానా మదర్సాను బుధవారం కూల్చివేసింది. అల్ ఖైదాతో సంబంధాలున్న కారణంగానే ఈ కూల్చివేత జరిగినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కట్టినందుకే కూల్చినట్లు.. ముందస్తు నోటీసుల తర్వాతే కూల్చివేసినట్లు ప్రకటించారు. 

ఇక ఈ వారంలో ఇది రెండో మదర్సా కూల్చివేత. నెల వ్యవధిలో మూడో కూల్చివేత. అంతకు ముందు బార్‌పేటలో ఇద్దరు బంగ్లాదేశీ ఉగ్రవాదులకు నాలుగేళ్లుగా ఆశ్రయం ఇచ్చారని సోమవారం ఓ మదర్సాను కూల్చేశారు. ఢక్లియాపరా ప్రాంతంలోని ఉన్న‌షేఖుల్ హింద్ మహ్మదుల్ హసన్ జామియుల్ హుదా అనే మదర్సాను బుల్డోజర్‌తో నేలమట్టం చేశారు. అంతకు ముందు మదర్సాలో తనిఖీలు చేపట్టగా.. నిషేధిత రాడికల్ గ్రూపులకు సంబంధించిన ప‌లు పత్రాలు, ప్ర‌చార ప్ర‌తులు దొరికాయి. ఈ నేపథ్యంలో కట్టడానికి అనుమతులు లేవంటూ కూల్చేశారు.  అలాగే.. అల్ ఖైదాతో సంబంధం ఉన్న ఇమామ్‌లు. మదర్సా ఉపాధ్యాయులతో సహా 37 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ మదర్సా కూల్చివేతకు ముందు.. అందులోని నుంచి విద్యార్థుల‌ను ఖాళీ చేయించి.. ఇతర విద్యాసంస్థలకు పంపించారు. అల్-ఖైదా, బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ అన్సరుల్ బంగ్లా టీమ్ (ABT) సభ్యులు మదర్సాలలో తలదాచుకుంటున్న ఘటనలు ఇప్పుడు పెరిగిపోతున్నాయ్‌. జిహాదీ కార్యకలాపాలకు అస్సాం హాట్‌బెడ్‌గా మారిందంటూ తాజాగా సంచలన వ్యాఖ్యలే చేశారు సీఎం హిమంత బిస్వా శర్మ. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటిదాకా 40 మంది బం‍గ్లాదేశీ ఉగ్రవాదులను అస్సాం పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు ముస్లిం మతపెద్దలు, మదర్సాల నిర్వాహకులు సీఎం హిమంతను ‘బుల్డోజర్‌ రాజా’గా అభివర్ణిస్తూ.. చర్యలు ఆపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆరెస్సెస్‌కు సపోర్టుగా దీదీ కామెంట్లు

మరిన్ని వార్తలు