బీచ్‌లో స్నానం.. అంతలోనే తండ్రిని మింగేసిన అల..

17 Apr, 2022 16:33 IST|Sakshi
ప్రమాదానికి ముందు కొడుకుతో బన్సిధర్ బెహెరా

భువనేశ్వర్‌: పూరీ బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. సముద్రపు స్నానం ఓ బాలుడికి తండ్రిని దూరం చేసింది. ఈ ఘటన ఒడిశాలోని పూరీలో చోటు చేసుకుంది. బాలాసోర్‌కు చెందిన బన్సిధర్ బెహెరా(35) కుటుంబసభ్యులతో కలసి వేసవి టూర్‌ కోసం పూరీ సముద్ర తీరానికి వెళ్లారు. శనివారం తండ్రీకొడుకులు సరదాగా బీచ్‌లోకి దిగి.. ఆడుతుపాడుతూ స్నానం చేశారు. అలా వారు స్నానం చెస్తూ.. సముద్రపు ఓ పెద్ద అల వైపు బన్సిధర్‌ బెహెరా దూకాడు.

దీంతో ఆ పెద్ద అల వారిని అతలాకుతలం చేసింది.  అల నుంచి బన్సిధర్‌ బెహెరా తిరిగి రాలేదు. 12 ఏళ్ల అతని కొడుకు మాత్రం సురక్షితంగా ఉన్నారు. అతని కుటుంబసభ్యులు అప్రమత్తమైనప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అతని మృతదేహం కోసం డైవర్లు, ఫైర్‌ సిబ్బంది సముద్రంలో వెతుకుతున్నారు.

సముద్రంలోకి దిగి స్నానం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఇక్కడకు వచ్చే పర్యటకులకు చెబుతామని పూరీ బీచ్‌ పోలీసులు తెలిపారు. అయితే కొంతమంది తాము చెప్పే సూచనలు నిర్లక్ష్యం చేస్తుంటారని అన్నారు. దాని వల్లే ఇలాంటి ప్రమాదలు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. ఈ ఘటనను కుటుంబసభ్యుల్లో ఒకరు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. బన్సిధర్ బెహెరా బాలాసోర్‌లో చిరు వ్యాపారిగా పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు