సీసీటీవీలు, ఆడియో రికార్డింగ్‌ ఉండాల్సిందే : సుప్రీం

3 Dec, 2020 12:23 IST|Sakshi

జైళ్లు, లాకప్‌లు : సుప్రీం కీలక ఆదేశాలు

సాక్షి, న్యూఢిల్లీ: జైళ్లు, పోలీస్‌ స్టేషన్లు, లాకప్‌లు, ఇతర దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు, ఆడియో రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్రాన్ని ఆదేశించింది. అరెస్టు చేసి, విచారణ జరిపే అధికారం ఉన్న సీబీఐ, ఈడీ,నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ) తో సహా ఇతర దర్యాప్తు సంస్థల  విచారణ గదుల్లో  వీటిని విధిగా  అమర్చాలని సుప్రీం స్పష్టం చేసింది.

ప్రతి పోలీస్ స్టేషన్‌లో అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, మెయిన్ గేట్, లాకప్స్, కారిడార్లు, లాబీ, రిసెప్షన్ వద్ద వీటిని కచ్చితంగా ఏర్పాటు చేయాలని తేల్చి చెప్పింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (యూటీ)  ఈ మేరకు చర్యలు తీసుకునేలా చూడాలని జస్టిస్ ఆర్ఎఫ్ నరిమన్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఏప్రిల్ 3, 2018నాటి ఉత్తర్వులకు అనుగుణంగా  మానవ హక్కుల ఉల్లంఘనను అరికట్టేందుకు అన్ని పోలీస్‌ స్టేషన్లు, జైళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీం తేల్చి చెప్పింది. నవంబర్ 24 వరకు 14 రాష్ట్రాలు  నివేదికలను దాఖలు చేశాయని, వాటిలో ఎక్కువ భాగం ప్రతి పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, తదితర వివరాలను వెల్లడించడంలో విఫలమయ్యాయని తన 12 పేజీల ఉత్తర్వులో ధర్మాసనం పేర్కొంది. సీసీటీవీ వ్యవస్థలు తప్పనిసరిగా నైట్ విజన్ కలిగి ఉండాని ఈ పుటేజ్‌ లేదా డేటాను  కనీసం ఒక సంవత్సరం పాటు  స్టోరేజ్‌ చేయాలని అత్యున్నత ధర్మాసనం  తెలిపింది.  కేంద్రం, ఆయాలు రాష్ట్రాలు, యూటీలు దీనికి సంబంధించిన పరికరాలను కొనుగోలు చేయాలని పేర్కొంది. 

మరిన్ని వార్తలు