కరోనా వైరస్ వేరియంట్లు ప్రపంచ దేశాలను మరోసారి భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కొత్త వేరియంట్ల కారణంగా ఇప్పటికే చైనాతో పాటుగా మరికొన్ని దేశాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో, అక్కడ ప్రభుత్వాలు వైరస్ కట్టడికి పూర్తి స్థాయిలో ప్రణాళికలు చేస్తున్నాయి. కాగా, వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇటు భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.
ఇదిలా ఉండగా.. కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్పై సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్తు కొడుతోంది. కోవిడ్ ఒమిక్రాన్ ఎక్స్బీబీ వేరియంట్ వ్యాప్తి ప్రారంభమయిందని.. అలాగే ఈ వేరియంట్ ప్రాణాంతకమైనదంటూ వాట్సాప్ గ్రూప్లో ఓ వార్త వైరల్గా మారింది. దీంతో, పాటుగా ఎక్స్బీబీ వేరియంట్ను గుర్తించడం చాలా కష్టమని అందులో ఉంది. దీని వల్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని.. ఇది గతంలో వచ్చిన డెల్టా వేరియంట్ కన్నా ఐదు రెట్లు ప్రమాదకరమైనదని.. కాబట్టి మరింత జాగ్రత్త అవసరం అంటూ వార్తలో రాసి ఉంది. కాగా, వార్తపై నెటిజన్లు భయాందోళనలకు గురవుతున్నారు. ఇక, ఈ వార్తపై కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ ఇచ్చింది.
ఇది ఫేక్ వార్త అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ కొట్టిపారేసింది. ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందించింది. ఒమిక్రాన్ ఎక్స్బీబీ వేరియంట్పై సోషల్ మీడియాలో ఫేక్ వార్త ప్రచారంలో ఉంది. ఈ వార్తలను ప్రజలు నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని సీరియస్ కామెంట్స్ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం అప్రమత్తంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. మరోవైపు.. ఎక్స్బీబీ వేరియంట్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. ఎక్స్బీబీ వేరియంట్ వల్ల సోకే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.
This message is circulating in some Whatsapp groups regarding XBB variant of #COVID19.
The message is #FAKE and #MISLEADING. pic.twitter.com/LAgnaZjCCi
— Ministry of Health (@MoHFW_INDIA) December 22, 2022