ఎంత మంచి ఓనర్‌! దీపావళి కానుకగా సిబ్బందికి కార్లు, బైకులు, ఎక్కడంటే..

17 Oct, 2022 09:57 IST|Sakshi

వైరల్‌/చెన్నై: బాస్‌లలో.. మంచి బాసులు చాలా అరుదు. కేవలం టాస్క్‌లు, టార్గెట్‌లతో ఇబ్బందులు పెట్టేవాళ్లే ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే.. ఇక్కడో యజమాని.. తన దగ్గర పని చేసే ఉద్యోగులకు కార్లు, బైకులు కానుకలుగా ఇచ్చాడు. ఇది ఎక్కడో జరగలేదు.. మన పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలోనే జరిగింది.

దీపావళికి స్వీట్లు, కొత్త బట్టలు పంచే యజమానులనే ఇప్పటిదాకా చూసి ఉంటారు. కానీ, చెన్నైకి చెందిన నగల షాపు ఓనర్‌ జయంతి లాల్‌ చాయంతి మాత్రం.. సిబ్బందికి కార్లు, బైకులు ఇచ్చి పెద్ద సర్‌ప్రైజే ఇచ్చారు. ఈ కానుకలకుగానూ ఆయనకు అక్షరాల కోటి ఇరవై లక్షల ఖర్చు అయ్యింది. ఈ విషయం ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. 

చల్లానీ జ్యువెల్లరీలో పని చేసే ఉద్యోగులకు ఈ దీపావళికి మామూలు కానుకలు దక్కలేదు. వాళ్ల వాళ్ల పర్‌ఫార్మెన్స్‌, హోదాలను బట్టి కొంత మందికి బైకులు, మరికొందరికి కార్లను కానుకగా పంచారు జ్యువెలరీ అధినేత జయంతి లాల్‌ ఛాయంతి. మొత్తం సిబ్బంది కోసం పది కార్లు.. ఇరవై బైకులను పంచారాయన. కుటుంబాలతో సహా భోజనాలకు ఆహ్వానించడంతో.. ప్రతీ ఏడాది షరా మామూలుగా నిర్వహించే కార్యక్రమమే అనుకున్నారంతా. అయితే  ఊహించని ఈ సర్‌ప్రైజ్‌లు అందుకుంటూ ఉద్యోగుల్లో కొందరు భావోద్వేగానికి లోనై కంట తడి పెట్టుకున్నారు. 

వీళ్లు ఉద్యోగులు కారు.. నా కుటుంబ సభ్యులు. అందుకే వీళ్లకు ఈ  నా విజయంలో.. వైఫల్యంలో.. ప్రతీ అడుగులో వీళ్లు అడుగు వేశారు. నా వెన్నంటే ఉన్నారు. లాభాల బాట పట్టడానికి వీళ్లు చేసిన కృషికి వెలకట్టలేను. కానీ, వాళ్లను ఇలా ప్రొత్సహించాలని అనుకున్నా.. అంతే అని తెలిపారాయన. యజమాని ఊహించిన సర్‌ప్రైజ్‌ పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు