Mahisha Dussehra Controversy: కర్నాటకలో మహిష దసరా వివాదం ఏమిటి?

11 Oct, 2023 13:49 IST|Sakshi

కర్నాటకలోని మైసూరులో అక్టోబరు 13 నుంచి మహిష దసరా ఉత్సవాలు జరగనున్నాయి. అయితే ఇవి రోజురోజుకు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా మహిష దసరా వేడుకలను వ్యతిరేకిస్తూ ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దసరా నేపథ్యంలో సాంస్కృతిక నగరమైన మైసూర్ అందంగా ముస్తాబైంది. ప్యాలెస్ భవనంలో నూతన బల్బులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేస్తున్నారు. 

కాగా మహిష దసరా వేడుకలను వ్యతిరేకిస్తూ స్నేహమహి కృష్ణ అనే వ్యక్తి మైసూర్ 8వ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం మహిష దసరా ఆచారణ కమిటీ చైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 11వ తేదీకి వాయిదా పడింది.

2015 నుంచి దళిత అనుకూల సంస్థలు, అభ్యుదయవాదులు మైసూర్‌లో మహిష దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిష దసరా వేడుకల నిర్వహణకు అవకాశం కలగలేదు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక మహిష దసరా వేడుకల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.

మహిష దసరా వేడుకలపై ఎంపీ ప్రతాపసింహ తదితరులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మహిష దసరా వేడుకలు జరగనివ్వబోమని ఆయన అన్నారు. కాగా ఈసారి 50 ఏళ్ల మహిష దసరా వేడుకలు జరుపుకుంటున్నట్లు మహిష దసరా వేడుకల కమిటీ పోస్టర్‌ను విడుదల చేసింది. మహిష దసరా సెలబ్రేషన్ కమిటీ, మైసూర్ యూనివర్సిటీ పరిశోధకుల సంఘం అక్టోబర్ 13న మహిష దసరా వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించాయి. చాముండి కొండను మహిష కొండగా పేర్కొంటూ ఆహ్వాన పత్రికను కూడా విడుదల చేశారు. ఈ నేపధ్యంలో మహిష దసరా వివాదాస్పదమయ్యింది. 

మహిష దసరా వేడుకలను వ్యతిరేకించాలని బీజేపీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మహిషుని పేరుతో ఉత్సవాలు నిర్వహించడమంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని బీజేపీ నేతలు పేర్కొన్నారు. అయితే మహిష దసరా కమిటీ దీనిపై స్పందిస్తూ ‘మహిషను రాక్షసునిగా తప్పుగా అభివర్ణించారన్నారు. మైసూరు రాజు మహిష పరిపాలనను నాటి ప్రజలు ఎంతో ఇష్టపడేవారన్నారు. అందుకే మహిష దసరా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 
ఇది కూడా చదవండి: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? జనాభా ఎంత?

మరిన్ని వార్తలు