ముగియనున్న సీబీఐ కస్టడీ.. కోర్టుకు సిసోడియా, పొడగింపు వద్దనుకుంటున్న దర్యాప్తు సంస్థ

6 Mar, 2023 10:46 IST|Sakshi

ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టులో నేడు విచారణ కొనసాగనుంది. ఈ కేసులో అరెస్ట్‌ అయిన ఆప్‌ కీలక నేత మనీశ్‌ సిసోడియా సీబీఐ కస్టడీ ఇవాళ్టితో(సోమవారం) ముగియనుంది. దీంతో.. దర్యాప్తు సంస్థ ఆయన్ని ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. 

సిసోడియాను సీబీఐ విచారరించేందుకు తొలుత ఐదు రోజులు, ఆ తర్వాత రెండు రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అక్రమాలు, ఆ టైంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా సిసోడియా తీసుకున్న నిర్ణయాలు, కనపడకుండా పోయిన ఫైల్స్, ముడుపులు,మద్యం వ్యాపారులకు అనుకూలంగా పాలసీ రూపకల్పన, నిందితులతో ఉన్న సంబంధాలపై .. తదితర అంశాలపై వారంగా ఆయన్ని సీబీఐ ప్రశ్నించింది. 

అయితే.. ఆయన కస్టడీ పొడగింపును సీబీఐ మరోసారి కోరే అవకాశం కనిపించడం లేదు. బదులుగా ఆయనకు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించాలని కోరవచ్చని సమాచారం. మరోవైపు సీబీఐ పదే పదే వేసిన ప్రశ్నలతోనే తనను మానసికంగా వేధిస్తోందని, బెయిల్‌ ఇప్పించాలని కోరుతూ 51 ఏళ్ల సిసోడియా కోర్టును ఆశ్రయించారు. అంతకు ముందు సుప్రీం కోర్టులో బెయిల్‌ కోసం అభ్యర్థించగా.. పిటిషన్‌ను తోసిపుచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టును సంప్రదించాలని సిసోడియాకు సూచించింది.

మరిన్ని వార్తలు