ఆర్థిక, దౌత్యంలో నూతనాధ్యాయం

15 Oct, 2023 05:38 IST|Sakshi

నాలుగు దశాబ్దాల తర్వాత మొదలైన భారత్, శ్రీలంక పడవ ప్రయాణ సేవలు

ద్వైపాక్షిక బంధానికి కీలకమని అభివర్ణించిన ప్రధాని మోదీ

నాగపట్నం/న్యూఢిల్లీ: దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత భారత్, శ్రీలంక మధ్య మొదలైన పడవ ప్రయాణ సేవలు ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాన్ని సుధృడం చేస్తాయని ప్రధాని మోదీ అభిలíÙంచారు. శనివారం తమిళనాడులోని నాగపట్నం, జాఫా్నలోని కంకెసంథురై మధ్య ఫెర్రీ సేవలు మొదలవడం అనేది ఇరుదేశాల మైత్రీ బంధంలో కీలకమైన మైలురాయి అని మోదీ శ్లాఘించారు. షిప్పింగ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ హైస్పీడ్‌ ఫెర్రీ సేవలు మొదలయ్యాయి.

సముద్రమార్గంలో 110 కిలోమీటర్ల దూరాన్ని 3.5 గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. ఫెర్రీ సేవలను లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా చెరియాపని అనే పడవ 50 మంది ప్రయాణికులతో శ్రీలంకకు బయల్దేరింది. సాయంత్రం కల్లా భారత్‌కు తిరిగొచి్చంది. ‘ఇరుదేశాల మధ్య కనెక్టివిటీతోపాటు వాణిజ్యం, బంధాల బలోపేతానికి ఫెర్రీ సేవలు ఎంతో కీలకం’ అని ప్రధాని మోదీ తన వీడియో సందేశంలో వ్యాఖ్యానించారు. ‘ ఈ బంధం ఈనాటిదికాదు. ప్రాచీన తమిళ సాహిత్యంలోనూ దీని ప్రస్తావన ఉంది.

సంగం కాలం నాటి పట్టినాప్పలై, మణిమేఖలై సాహిత్యంలోనూ భారత్, శ్రీలంక నౌకల రాకపోకల వివరణ ఉంది. ప్రఖ్యాత కవి సుబ్రమణ్యభారతి రాసిన పాట ‘సింధు నదియన్‌ మిసై’లోనూ రెండుదేశాల బంధాన్ని వివరించారు. చారిత్రక, సాంస్కృతిక బంధాల్లో ఈ పడవ ప్రయాణాల మధుర జ్ఞాపకాలు సజీవంగా ఉన్నాయి. ఇటీవల భారత్‌లో పర్యటించిన సందర్భంగా విక్రమసింఘే అనుసంధాన సంబంధిత విజన్‌ డాక్యుమెంట్‌ను భారత్‌తో పంచుకున్నారు. 2015లో శ్రీలంకలో నేను పర్యటించాకే ఢిల్లీ, కొలంబో మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి ’ అని మోదీ గుర్తుచేసుకున్నారు.

మనసులనూ దగ్గర చేస్తోంది
‘ఈ అనుసంధానం రెండు పట్టణాలను మాత్రమే కాదు. రెండు దేశాలను, దేశాల ప్రజలను, వారి మనసులనూ దగ్గర చేస్తోంది. ‘పొరుగుదేశాలకు ప్రాధాన్యం’ అనే మోదీ సర్కార్‌ విధానాన్ని మరింత తీసుకెళ్తున్నాం’ అని ఈ సేవలను లాంఛనంగా పచ్చజెండా ఊపి ప్రారంభించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర నౌకలు, షిప్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్‌ పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య అనుసంధానం, వాణిజ్యం, పర్యాటకం, సాంస్కృతిక అనుబంధాలను మరింత మెరుగుపరిచేందుకు ఈ సేవలు దోహదపడతాయని శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే వ్యాఖ్యానించారు. గతంలో చెన్నై, కొలంబోల మధ్య తూత్తుకుడి మీదుగా ఇండో–సియోల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆధ్వర్యంలో పడవ ప్రయాణలు కొనసాగేవి. అయితేశ్రీలంకలో పౌర సంక్షోభం తలెత్తాక 1982లో ఆ సేవలు నిలిచిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఇలా పడవ సేవలు పునఃప్రారంభమయ్యాయి. 

మరిన్ని వార్తలు