మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు..

4 Feb, 2021 12:39 IST|Sakshi

చెన్నై: మద్రాస్‌ హైకోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. ఆడ, మగ ఇద్దరు తాళం వేసిన ఇల్లు, గదిలో ఉన్నంత మాత్రాన వారి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు భావించలేమని స్పష్టం చేసింది. ఓ సాయుధ రిజర్వ్ పోలీసు కానిస్టేబుల్ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ సంచలన తీర్పు వెల్లడించింది. 1998లో చోటు చేసుకున్న ఈ ఘటనలో.. కే శరవణ బాబు అనే సాయుధ రిజర్వ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ తన క్వార్టర్‌లో మరో మహిళా కానిస్టేబుల్‌తో కలిసి ఉండటాన్ని అధికారులు తప్పు పట్టారు. వారి మధ్య అక్రమ సంబంధం ఉందని.. అందుకే తలుపులు వేసుకుని ఇద్దరు లోపల ఉన్నారని ఆరోపించారు. ఇక ఇలాంటి చర్యలకు పాల్పడినందకు గాను అతడిని విధుల నుంచి తొలగించారు. దాంతో శరవణ బాబు కోర్టును ఆశ్రయించాడు. 

ఇక కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ ఆర్‌ సురేష్‌ కుమార్‌ రద్దు పిటిషన్‌ని విరమించుకుంటూ.. ‘‘సమాజంలోని ఊహాతీత కథనాలను ఆధారంగా చేసుకుని క్రమశిక్షణా చర్యలు విధించడం.. విధుల నుంచి తొలగించడం సరైనది కాదు. ఇక ఈ కేసులో నిందితుడు శరవణ బాబు తన నివాసంలో ఓ మహిళా కానిస్టేబుల్‌తో ఉన్నాడు. అంత మాత్రాన వారి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు భావించలేమని’’ వెల్లడించింది. అంతేకాక నిందితుడి వాదనతో ఏకీభవించిన హై కోర్టు ఇద్దరు కానిస్టేబుల్స్‌ని అభ్యంతరకర స్థితిలో చూసినట్లు ఒక్క ప్రతక్ష్య సాక్షి గాని.. మరే ఇతర ఆధారాలు గాని లేవని స్పష్టం చేసింది. 
(చదవండి: మద్రాస్‌ హైకోర్టు కమిటీ చారిత్రక నిర్ణయం)

ఈ సందర్భంగా శరవణ బాబు మాట్లాడుతూ.. ‘‘సదరు మహిళా కానిస్టేబుల్‌ నివాసం.. నా క్వార్టర్స్‌ దగ్గర దగ్గరగా ఉంటాయి. ఇక ఆమె ఇంటి తాళం కోసం నా నివాసానికి వచ్చింది. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగా.. ఎవరో తలుపు లాక్‌ చేశారు. ఆ తర్వాత మేం డోర్లు వేసుకుని ఇంట్లో ఏదో అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్లు భావించిన ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపు తట్టారు’’ అని తెలిపాడు. 
 

మరిన్ని వార్తలు