స్పీకర్‌ సహా ఇద్దరు మంత్రులకు నాన్ బెయిలబుల్‌ వారెంట్‌.. ఆప్‌కు గట్టి షాక్‌!

31 Aug, 2022 15:19 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర శాసనసభా స్పీకర్‌, ఇద్దరు మంత్రులు సహా మొత్తం 9 మందికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది కోర్టు. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ అందుకున్న వారిలో స్పీకర్‌ కుల్తార్‌ సింగ్‌ సంధ్వాన్‌, కేబినెట్‌ మంత్రులు గుర్మీత్‌ సింగ్‌ మీట్‌ హేయర్‌, లల్జిత్‌ సింగ్‌ భుల్లార్‌ సహా పలువురు ఆప్‌ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. 

సరిహద్దు జిల్లాలైన అమృత్‌సర్‌, తరన్‌ తరన్‌లో కల్తీ మద్యం మరణాలకు వ్యతిరేకంగా 2020, ఆగస్టులో నిరసనలు చేపట్టారు పలువురు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు. దీనికి సంబంధించి పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ప్రస్తుత స్పీకర్‌, కేబినెట్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కేసులో భాగంగా కోర్టుకు హాజరుకావాలని ఇటీవలే ఆదేశించింది న్యాయస్థానం. అయితే, వారు హాజరుకాకపోటంతో తాజాగా నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది. 

మరోవైపు.. కల్తీ మద్యం తయారీకి ఉపయోగించే ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌(ఈఎన్‌ఏ) అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు ఎక్సైజ్‌, టాక్సేషన్‌  శాఖ మంత్రి హర్పల్‌ సింగ్‌ చీమా. రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎక్సైజ్‌ అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి.. రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయాలను అడ్డుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఈఎన్‌ఏ రవాణాను నియంత్రించాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ‘ఆప్‌ ఎమ్మెల్యేలతో బేరమాడింది ఎవరు?’

మరిన్ని వార్తలు