‘అంత్యక్రియలు అయ్యాక ప్రత్యక్షం.. దెయ్యమా ఏంటి?’

27 May, 2021 19:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాజస్తాన్‌లో చోటచేసుకున్న ఘటన

కుటుంబ సభ్యుడికి బదులు కుళ్లిన మృతదేహానికి అంత్యక్రియలు

వారం తర్వాత తిరిగి వచ్చిన అసలు వ్యక్తి

జైపూర్‌: ఓంకార్‌ గుడిలియ అనే వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. లివర్‌ చెడిపోయింది. దాంతో ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఆస్పత్రిలో చేరాడు. నాలుగైదు రోజులు గడిచినా ఇంటికి రాలేదు. ఈ లోపు పోలీసులు గుర్తు తెలియని మృతదేహం గురించి అంటించిన పోస్టర్లు చూసి.. పొరపాటున ఓంకార్‌ గుడిలియాదిగా భావించి ఆ గుర్తు తెలియని మృతదేహాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వమించారు. అయితే వారం రోజుల తర్వాత ఓంకార్‌ గుడిలియ ప్రత్యక్షం అయ్యాడు. దాంతో అతడి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. దెయ్యం అయ్యాడా ఏంటి అని భయపడసాగారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. ఆ వివారలు.. 

రాజస్తాన్‌లోని రాజ్సమండ్ జిల్లాకు చెందిన ఓంకార్‌ గుడిలియ ఈ నెల 11న ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఉదయ్‌పూర్‌ వెళ్లాడు. లివర్‌ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న అతడు ఆర్‌కే ఆస్పత్రిలో చేరాడు. లాక్‌డౌన్‌ విధించడంతో గుడిలియా కుటుంబం అతడి సోదరుడి ఇంట్లో ఉండిపోయింది. మరోవైపు సరిగా ఓంకార్‌ ఆస్పత్రిలో చేరిన నాడే గోవర్థన్‌ ప్రజాపత్‌ అనే వ్యక్తిని కొందరు హెల్త్‌ వర్కర్స్‌ ఆర్‌కే ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత అతడు మరణించడంతో ఆస్పత్రి వర్గాలు గుర్తుతెలియని మృతదేంగా మార్చురీలో ఉంచారు. 

ఆ తర్వాత ఈ గుర్తు తెలియని మృతదేహం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు డెడ్‌బాడీని అనేక యాంగిల్స్‌లో ఫోటో తీసి.. ఆస్పత్రి చుట్టుపక్కల గ్రామాల్లో పోస్టర్లు అంటించారు. మరోవైపు ఓంకార్‌ గుడలియ ఇంటి నుంచి వెళ్లిపోయి మూడు నాలుగు రోజులు గడుస్తున్నప్పటికి అతడి ఆచూకీ తెలియరాలేదు. ఈ క్రమంలో తమ ఊరిలో అంటించిన గుర్తు తెలియని మృతదేహం పోస్టర్లు వారిలో అనుమానం రేకేత్తించాయి. 

దాంతో ఓంకార్‌ గుడిలియ కుటుంబ సభ్యులు, బంధువులు అంతా కలిసి పదిహేను మందికి పైగా ఆర్‌కే ఆస్పత్రికి వెళ్లారు. గుర్తు తెలియన మృతదేహాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో ఓంకార్‌ కుడి చేతి మీద ఉన్న మచ్చలాంటిదే గోవర్ధన్‌ చేతి మీద కూడా ఉండటంతో వారు పోరపాటున గోవర్థన్‌ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఓ వారం రోజుల తర్వాత ఓంకార్‌ గుడిలియ తిరిగి రావడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. 

ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘దీనిలో మా తప్పేం లేదు.  అతడి కుటుంబ సభ్యులే పొరపాటున గోవర్ధన్‌ మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు’’ అని తెలిపారు. 

చదవండి: మా నాన్న అంత్యక్రియలు మీరే చేయండి  

>
మరిన్ని వార్తలు