ఎస్‌పీజీ నుంచి 200 మంది వెనక్కి 

3 Aug, 2020 09:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: దేశంలో ప్రముఖుల భద్రత కోసం ఉద్దేశించిన ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీజీ‌)లో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి దాకా పలువురు ప్రముఖ వ్యక్తులకు భద్రత కల్పించిన ఈ విభాగం.. ప్రధాన మంత్రికి మాత్రమే భద్రత కల్పించేలా కేంద్రం కీలక మార్పులు చేపట్టడంతో తాజాగా సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా డెప్యుటేషన్‌ పూర్తయిన సుమారు 200 మంది సిబ్బందిని మాతృ విభాగాలకు పంపిస్తూ ఆదేశాలు జారీ చేసింది. (ఎస్పీజీ చట్టానికి ప్రక్షాళన)

కాగా కమాండో శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది 4 వేల మంది వరకు ఎస్‌పీజీలో ఉన్నారు. వీరిని విడతల వారీగా 50 నుంచి 60 శాతం మేర వెనక్కి పంపించి, అంతర్గత రక్షణ విధుల్లో వినియోగించుకుంటామని అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ భద్రతకు కేటాయించిన సిబ్బంది మాత్రమే ఎస్‌పీజీలో ఉంటారని అన్నారు. ఎస్‌పీజీ ఏర్పాటయ్యాక ఇలా కుదింపు చేపట్టడం ఇదే ప్రథమం. 1985లో ఏర్పాటైన ఎస్‌పీజీ కోసం వివిధ పారామిలటరీ, కేంద్ర సాయుధ పోలీసు బలగాల నుంచి సిబ్బందిని ఎంపిక చేసుకున్నారు.

మరిన్ని వార్తలు