వేలూరు: భానుడి భగభగల్లోనూ నడిరోడ్డుపై నిలబడి విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసుల కష్టాన్ని ఓ విద్యార్థిని గుర్తించింది. ఎండ వేడిమికి తాళలేక ఇబ్బంది పడుతున్న వారికి తాగునీరు, మజ్జిగ, మాస్క్లను అందజేసింది. వివరాలు.. వేలూరు అరియూర్కు చెందిన సింధు అనే పదో తరగతి విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతో ట్రాఫిక్ పోలీసుల దాహార్తిని తీర్చింది. వారు కరోనా బారిన పడకుండా మాస్క్లను పంపిణీ చేసింది. వేలూరు బాగాయం నుంచి కొత్త బస్టాండ్ వరకు సైకిల్పై వెళుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు సాయం అందజేసింది. మానవత్వం చాటుకున్న విద్యార్థినిని పోలీసులు, స్థానికులు అభినందించారు.