ఇద్దరి మృతి, మరో ఇద్దరి గల్లంతు
సాక్షి ముంబై: ముంబైని వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం తెల్లవారుజాము 3 గంటల నుంచి ఉదయం 6.30 గంటలకు కుండపోతగా వర్షం కురిసింది. దీంతో జనజీవనం అతలాకుతలమైంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబై, థానే, కల్యాణ్, డోంబివలి, మీరారోడ్డు, వసై, భయిందర్, విరార్, పాల్ఘర్, నవీముంబై తదితర ప్రాంతాలు జలాశయాలను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లోని అనేక మంది ఇళ్లల్లో వర్షం నీరుచొరబడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సేవలందించే వారి కోసం నడిపిస్తున్న లోకల్ రైళ్ల రాకపోకలతోపాటు రోడ్డు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. వెస్టర్న్ ఎక్స్ప్రెస్ మార్గంపై కాందీవలి, మలాడ్ మధ్యలో కొండచరియలు విరిగి హైవేపై పడ్డాయి. శాంతాక్రజ్లో 269 విల్లీమీటర్లు, కోలాబాలో 252 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ముంబై, థానేలలో ఒక్కరు చొప్పున ఇద్దరు మృతి చెందారు.