విషాదం: పోలింగ్‌ కేంద్రంలో జవాన్‌ ఆత్మహత్య

1 Apr, 2021 19:36 IST|Sakshi

కోల్‌కత్తా: ఎన్నికలకు అంతా సిద్ధమైంది.. కొద్దిసేపయితే పోలింగ్‌ ప్రారంభం అవ్వాల్సిన సమయంలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. విధులు నిర్వహించడానికి వచ్చిన ఓ జవాన్‌ ఆత్మహత్య చేసుకోవడం కలకలం
రేపింది. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఎన్నికలకు అంతరాయం ఏర్పడింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో రెండో దశ పోలింగ్‌ గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని పాతర్‌ ప్రతిమ పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్ ఏర్పాట్లు చేశారు.

ఆ కేంద్రంలో బందోబస్తు నిర్వహించేందుకు సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌కు చెందిన కమల్‌గంగూలీ బుధవారం వచ్చాడు. అయితే రాత్రి ఏం జరిగిందో ఏమో కానీ తెల్లవారేసరికి విగతజీవిగా మారాడు. ఆ పోలింగ్‌ కేంద్రంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం చూసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. ఒకవైపు ఎన్నికలు ఉన్నాయి.. ఇక్కడేమో మృతదేహం అని కంగారు పడ్డారు. వెంటనే మృతదేహాన్ని దించి పోస్టుమార్టం తరలించారు. అనంతరం పోలింగ్‌ కేంద్రంలో మొత్తం సర్దుబాటు చేసి ఏర్పాట్లు పునరుద్ధరించారు. అయితే జవాన్‌ గంగూలీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియరాలేదు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు