● బీజేపీ రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి
సత్యబ్రత పండా
భువనేశ్వర్: రాష్ట్రంలోని ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం పడుతోందని బీజేపీ రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి సత్యబ్రత పండా అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సామాన్యుడి నెలవారీ బడ్జెట్లో ఎక్కువ భాగం విద్యుత్ వినియోగానికి చెల్లించాల్సి వస్తోందని ఆరోపించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం భారతదేశంలో ఇతర వినియోగదారుల కంటే ఒడిశా వినియోగదారులు ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులు యూనిట్కు 80 పైసలు పైబడి చెల్లిస్తున్నారని తెలిపారు. సుస్థిర దీర్ఘపాలన బీజేడీ సర్కారు నిర్వాకంతో ఈ పరిస్థితి తాండవించిందని ఆరోపించారు. విద్యుత్ ఉత్పాదన, పంపిణీ ఇతరేతర అనుబంధ కార్యకలాపాల్లో అవినీతి, అక్రమాలు రాష్ట్రంలో సామాన్య వినియోగదారునిపై అవాంఛిత భారం మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో విద్యుత్ చార్జీలు గణనీయంగా పెరుగుతాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితి నివారణపై నిర్మాణాత్మక కార్యాచరణతో ముందుకు రాకుంటే తమ పార్టీ ప్రజా ప్రయోజనాల కోసం ఆందోళన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.