శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటు హక్కు ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ బి.లాఠకర్ పేర్కొన్నారు. పురుషుల ప్రభుత్వ కళాశాల మైదానంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన స్వీప్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో ఓటు హక్కు కీలకమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. జిల్లా జనాభాలో 18 ఏళ్లు నిండిన 46 వేలమంది యువత ఉండగా వారిలో 18 వేల మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారని చెప్పారు. మిగిలిన వాళ్లు కూడా ఓటర్లుగా చేరాలన్నదే స్వీప్ కార్యక్రమం లక్ష్యమన్నారు. జిల్లాలో 2500 మంది అధికారులు 24 లక్షల మంది ఓటర్ల జాబితా తయారీలో ఎంతో శ్రమతో పనిచేస్తారని, అన్ని వర్గాల సహాయ సహకారాలతోనే అది సాధ్యమన్నారు. ఈ రోజు నుంచి డిసెంబర్ నెల వరకు నమోదు ప్రక్రియ సాగుతుందని, అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వీప్ కార్యక్రమాల్లో యువత ప్రధాన పాత్ర పోషించాలన్నారు. ఓటు హక్కు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. అనంతరం వాకర్స్, విద్యార్థులు కలిసి ఆర్ట్స్ కళాశాల నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకూ ర్యాలీగా వెళ్లారు. అక్కడే వారితో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ విద్యాసాగర్, రెవెన్యూ డివిజనల్ అధికారి సీహెచ్ రంగయ్య, జిల్లా పౌర సంబంధాల అధికారి కె.బాలమాన్సింగ్, తహసీల్దార్ కె.వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.