ప్రధాని మోదీ ‘ఉచితహామీల’ విమర్శపై సీఎం కేజ్రీవాల్‌ స్పందన

16 Jul, 2022 18:56 IST|Sakshi

ఢిల్లీ: ఉచిత హామీల పేరిట ఓట్లు గడించేవాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలు, ప్రత్యేకించి యువతను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు.  

‘‘నన్ను టార్గెట్‌ చేసి విమర్శిస్తున్న వాళ్లు.. వేల కోట్లు వెచ్చించి విమానాలు, ప్రైవేట్ జెట్‌లు కొన్నారు. కేజ్రీవాల్ తన కోసం విమానాలేం కొనడం లేదు. ఢిల్లీలో ఇన్ని వస్తువులను ఉచితంగా చేసినప్పటికీ, మన బడ్జెట్ ఇంకా లాభాల్లోనే నడుస్తోంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. తాజా కాగ్ నివేదిక ఈ విషయాన్ని చెబుతోంది’’ అంటూ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

ఉచిత హామీలను రేవ్డితో(నార్త్‌లోని స్వీట్‌ వంటకంతో) పోల్చారు ప్రధాని మోదీ. అలాంటి హామీలు దేశానికి ఎంతో ప్రమాదకరమైనవి అని ప్రజలు, యువతను ఉద్దేశించి ఆయన శనివారం యూపీ బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఈవెంట్‌లో వ్యాఖ్యానించారు. అయితే ఉచితంగా విద్య, వైద్య సదుపాయాలను విద్యార్థులకు, పౌరులకు అందించడం రేవ్డి కాదని పేర్కొన్నారు సీఎం కేజ్రీవాల్‌. ఆరోపణలు చేసేవాళ్లను ఒక్కటే అడుగుతున్నా. నేనే తప్పు చేశాను. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల్లో 18 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ఉచితంగా నాణ్యమైన చదువు వాళ్లకు అందిస్తున్నాం. ఇదేమైనా నేరమా? అని ప్రశ్నించారు.

సంబంధిత వార్త: ఎన్నికల్లో ‘ఉచిత హామీలు’ దేశాభివృద్ధికి ప్రమాదకరం

మరిన్ని వార్తలు