కిషన్‌రెడ్డిది ఫెయిల్యూర్‌ యాత్ర: ఎర్రబెల్లి

21 Aug, 2021 12:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర ఫెయిల్యూర్‌ యాత్ర అని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ధ్వజమెత్తారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. తెలంగాణలో టూరిజంకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. గిరిజన యూనివర్శిటీ కోసం ములుగులో స్థలం కేటాయించామని.. దానికి ఇప్పటివరకు కేంద్రం రూపాయి కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా కేంద్రం అమలు చేయలేదని దుయ్యబట్టారు.

కాగా ప్రజాఆశీర్వాద యాత్రలో భాగంగా శుక్రవారం కిషన్‌రెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి, తొర్రూరుల్లో, తర్వాత వరంగల్, వర్ధన్నపేట, జనగామలో యాత్ర సాగింది. శుక్రవారం రాత్రి హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం అంబాల నుంచి కమలాపూర్‌ వరకు యాత్ర నిర్వహించారు. ఆయాచోట్ల జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు.
చదవండి: 800 ఏళ్ల ఆలయం.. పదేళ్ల క్రితం విప్పదీసి కుప్పపోశారు   

మరిన్ని వార్తలు