‘ట్రోలింగ్‌’ వెనుక ఎవరున్నారు?

9 Dec, 2023 04:46 IST|Sakshi

కిషన్‌రెడ్డి సహా ముఖ్యనేతలు లక్ష్యంగా వ్యతిరేక ప్రచారం

వీటిని తిప్పికొట్టాలని పార్టీ నాయకత్వం ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: వివిధ సామాజిక మాధ్యమాల్లో పార్టీ నేతలే లక్ష్యంగా ‘ట్రోలింగ్‌’సాగడంపై బీజేపీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లకే పరిమితం కావడాన్ని ఎత్తిచూపుతూ పార్టీకి వ్యతిరేకంగా సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో వివిధ రకాల మీమ్స్, సందేశాలు ప్రచారం చేస్తుండటాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఇతర నేతలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ప్రచారం చేయడం వల్ల పరోక్షంగా బీజేపీ ఇమేజీ కూడా దెబ్బతింటోందని అంటున్నారు.

పార్టీని, నేతలను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్య మాల్లో పెడుతున్న పోస్టులను చూసి ముఖ్యనేతలు మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఇలాంటి వాటివల్ల అంతిమంగా పార్టీకే నష్టం జరగనున్నందున ట్రోలింగ్‌ అంశంపై నాయకత్వం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ప్రతికూల ప్రచా రం పట్ల పార్టీ నాయకులు, శ్రేణులు అప్రమత్తమై అలాంటి వాటిని ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు షేరింగ్‌లు చేయకుండా జాగ్రత్తలు తీసు కోవాలని పార్టీలో అంతర్గత సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఇలాంటి అభ్యంతరకర పోస్టులను తిప్పికొడుతూ పోస్టింగ్‌లు కూడా పెట్టాలని సూచించినట్టు తెలిసింది.

శాసన సభ ఎన్నికల నేపథ్యంలో కొంతకాలంగా పార్టీ లోని కొందరు నేతలు సొంతంగా సోషల్‌ మీడి యా టీమ్‌లను ఏర్పాటు చేసుకుని తమ ప్రచా రాన్ని సాగిస్తున్న విషయం విదితమే. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పార్టీని, నేతలను టార్గెట్‌ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టింగ్‌లు, కొందరు నేతలను టార్గెట్‌ చేస్తూ పనిగట్టుకుని ట్రోలింగ్‌ చేయడం వెనక పార్టీలోని వారే ఉన్నారనే అనుమానాలు కూడా వ్యక్త మతున్నాయి. వీటి వెనక ఎవరున్నారు, అసలు ఆయా నేతలను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు, అందుకు కారణాలు ఏమిటన్న దానిపై రాష్ట్ర పార్టీ లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు