ఉద్యానశాఖ ఏడీ మల్లిఖార్జున్
కొత్తపల్లి: తుపాను కారణంగా జిల్లాలో సుమారు 750 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ఉద్యాన శాఖ ఏడీ మల్లిఖార్జున్ చెప్పారు. గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. వర్షాలకు దెబ్బతిన్న ఉద్యాన పంటలను పరిశీలించారు. ఈ సందర్బంగా మల్లిఖార్జున్ మాట్లాడుతూ గొల్లప్రోలు మండలంలో 192 హెక్టార్లు, పిఠాపురం మండలంలో 43 హెక్టార్లలో అరటి పంటకు నష్టం వాటిల్లిందన్నారు. నష్టాన్ని పూర్తి స్ధాయిలో అంచనా వేసి నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ ఉలవకాయల నాగలోవరాజు, రైతులు ఉన్నారు.
ముంపు నుంచి తేరుకున్న జిల్లేడుపాడు
● గ్రామంలో పర్యటించిన డీపీఓ
భారతీ సౌజన్య
● ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు
తుని రూరల్: పంపా రిజర్వాయర్లోని అదనపు జలాలు, పుష్కర కాలువ వరద నీరు పోటెత్తడంతో నీట మునిగిన జిల్లేడుపాడు గ్రామం శుక్రవారానికి తెరుకుంది. పంపా, పుష్కర జలాలు ఒక్కసారిగా దిగువకు విడుదలవ్వడంతో తుని మండలం హంసవరం శివారు జిల్లేడుపాడు గ్రామాన్ని ముంచేత్తిన విషయం తెలిసిందే. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాలతో రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రాత్రంతా పునరావాస కేంద్రంలో తలదాచుకున్న గ్రామస్తులు ముంపు వీడడంతో శుక్రవారం ఇళ్లకు చేరుకున్నారు. జిల్లా పంచాయతీరాజ్ అధికారి కె.భారతీ సౌజన్య గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ముంపు బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు ధైర్యం చెప్పారు. రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులను గ్రామంలో అందుబాటులో ఉంచామన్నారు. సర్పంచ్ రాయి మేరీ అవినాష్ ఆధ్వర్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ పనులు నిర్వహించారు. తేటగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, మందులను పంపిణీ చేశారు. అయ్యప్పస్వాముల సౌజన్యంతో ముంపు బాధితులకు మధ్యా హ్నం భోజనాలు అందించారు. అలాగే తేటగుంట శివారు గవరపేటలో పుష్కర కాలువ నుంచి ప్రవహించే వరదనీరు తగ్గుముఖం పట్టింది. ఈఓపీఆర్డీ జయరామ్, సర్పంచ్ రాయి మేరీఅవినాష్ ఇంటింటికీ వెళ్లి అంటువ్యాధులుపై అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు.