Syed Musthaq Ali T20: సయ్యద్‌ ముస్తాక్‌ టి20లో దుమ్మురేపుతున్న దేశవాలీ ఆటగాళ్లు

9 Nov, 2021 21:34 IST|Sakshi

Syed Mushtaq Ali Trophy 2021.. దేశవాలీ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 ట్రోఫీలో ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. వరుస సెంచరీలతో విజృంభిస్తూ ఐపీఎల్‌తో టీమిండియా తలుపు తట్టడానికి ఎదురుచూస్తు‍న్నారు. తాజాగా మంగళవారం జరిగిన మ్యాచ్‌ల్లో టాప్‌-3 ప్రదర్శన ఒకసారి పరిశీలిద్దాం.

యష్‌ నాయర్‌:
ఈ మహారాష్ట్ర ఓపెనర్‌ గోవాతో మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో మెరిశాడు. (68 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 103 పరుగులు నాటౌట్‌) విజృంభించాడు. కాగా మ్యాచ్‌లో గోవాపై 73 పరుగులతో విజయం అందుకున్న మహారాష్ట్ర ఎలైట్‌ గ్రూఫ్‌ ఏ నుంచి నాకౌట్‌ దశకు క్వాలిఫై అయింది. 

నారాయణ్‌ జగదీష్‌:  
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు బ్యాటర్‌ నారాయణ్‌ జగదీష్‌ సూపర్ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు పవర్‌ ప్లే ముగిసేలోపే రెండు వికెట్లు కోల్పోయింది. 47 బంతుల్లో 67 పరుగులు చేసిన జగదీష్‌ నారాయణ్‌..  కెప్టెన్‌ విజయ్‌ శంకర్‌తో కలిసి మూడో వికెట్‌కు 105 పరుగులు జోడించి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.    

పారస్‌ డోగ్రా:
పాండిచ్చేరి ఆటగాడు పరాస్‌ డోగ్రా ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో విన్నింగ్‌ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. తొలుత బౌలింగ్‌లో శుభోద్‌ భాతీ(/27)తో మెరవడంతో ఒడిశా 132 పరుగులకే పరిమితమైంది. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాండిచ్చేరి 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. ఓపెనర్‌ శుభోత్‌ బాతీ గోల్డెన్‌ డక్‌ కాగా.. ఆ తర్వాత కెప్టెన్‌ దామోదరన్‌ రోహిత్‌ 8 పరుగులు చేసి రనౌటయ్యాడు. ఈ దశలో పారస్‌ డోగ్రా 44 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. అతనికి రఘుపతి(39) సహకరించాడు.

మరిన్ని వార్తలు