బళ్లారి రూరల్: విమ్స్లో కనీస, అత్యవసర సౌకర్యాల ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య విద్యా శాఖా మంత్రి డాక్టర్ శరణ ప్రకాష్ పాటిల్ తెలిపారు. గురువారం విమ్స్ సందర్శన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కళ్యాణ కర్ణాటకలోని జిల్లాల్లో మొత్తం ఆరు మెడికల్ కాలేజీలు ఉన్నాయన్నారు. విజయనగర జిల్లాలో త్వరలోనే కొత్త మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికల్లా మెడికల్ కాలేజీ వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం విమ్స్కు నిర్దేశించిన బడ్జెట్ను తారతమ్యం లేకుండా విడుదల చేస్తామన్నారు. విమ్స్లో అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచుతామన్నారు. విమ్స్ వైద్యులు రోగులకు మందులను బయటకు రాసివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. విమ్స్ వైద్యులు పని వేళల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బీజేపీ ఉనికిని కోల్పోతోందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్లో ఎటువంటి విభేదాలు లేవన్నారు. అంతా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అసత్య వార్తలకు బీజేపీ ఆజ్యం పోస్తోందన్నారు. విమ్స్లోని అన్ని వార్డులను సందర్శించి రోగులకు అందిస్తున్న చికిత్సను, దంతవైద్య కళాశాలను పరిశీలించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే భరత్రెడ్డి, మేయర్, మాజీమేయర్, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ గంగాధరగౌడ, వైద్యులు పాల్గొన్నారు.
విజయనగరలో త్వరలో కొత్త మెడికల్ కళాశాల ఏర్పాటు
విమ్స్ వైద్యులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే కఠిన చర్యలు
రాష్ట్ర వైద్య విద్యా శాఖా మంత్రి శరణ ప్రకాష్ పాటిల్