BCCI Contracts: హార్ధిక్‌, కుల్దీప్‌లకు భారీ షాక్.. గబ్బర్‌, పురానేలకు డిమోషన్

3 Mar, 2022 15:20 IST|Sakshi

BCCI Contracts: 2021-22 సంవత్సరానికి గాను బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌లలో టీమిండియా సీనియర్‌ ఆటగాళ్లకు చుక్కెదురైంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, జస్ప్రీత్‌ బుమ్రాలు 'ఎ ప్లస్‌' గ్రేడ్‌ను నిలబెట్టుకోగా.. టెస్ట్‌ స్పెషలిస్ట్‌ ఆటగాళ్లు పుజారా, రహానే, ఇషాంత్‌ శర్మలు తమ ‘ఎ’ గ్రేడ్‌ను కోల్పోయి ‘బి’ గ్రేడ్‌లోకి పడిపోయారు. గాయాల కారణంగా గతకొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, వన్డేలు మాత్రమే పరిమితమైన శిఖర్‌ ధవన్‌లు ఏకంగా ‘ఎ’ నుంచి ‘సి’ గ్రేడ్‌కు దిగజారగా.. మయాంక్ అగర్వాల్‌, సాహాలు ‘బి’ నుంచి ‘సి’ గ్రేడ్‌కు పడిపోయారు. ఇప్పటివరకు ‘సి’ గ్రేడ్‌లో ఉన్న హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు ‘బి’ గ్రేడ్‌ దక్కగా.. కుల్దీప్‌ యాదవ్, నవదీప్‌ సైనీలు ఏకంగా కాంట్రక్ట్‌నే కోల్పోయారు. 

బీసీసీఐ ఈ ఏడాదికి గాను 27 మందితో సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కుదుర్చుకోగా.. రోహిత్‌, కోహ్లి, బుమ్రాలు 'ఎ ప్లస్‌' గ్రేడ్‌లో.. అశ్విన్, జడేజా, పంత్, రాహుల్, షమీలు ‘ఎ’ గ్రేడ్‌లో.. పుజారా, రహానే, అక్షర్‌, శార్ధూల్‌, శ్రేయస్‌, సిరాజ్‌, ఇషాంత్‌లు ‘బి’ గ్రేడ్‌లో.. ధవన్‌, ఉమేశ్‌, భువనేశ్వర్‌, హార్ధిక్‌, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, శుభ్‌మన్‌ గిల్‌, విహారి, చహల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సాహా, మయాంక్‌లు ‘సి’ గ్రేడ్‌లో ఉన్నారు. వీరిలో 'ఎ ప్లస్‌' కేటగిరీలో ఉన్నవాళ్లకు ఏటా రూ.7 కోట్లు, ‘ఎ’ కేటగిరీ ప్లేయర్లకు రూ.5 కోట్లు, ‘బి’ కేటగిరీ ప్లేయర్లకు రూ.3 కోట్లు, ‘సి’ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు రూ.1కోటి పారితోషికంగా లభించనుంది.
చదవండి: కోహ్లి వందో టెస్టు.. వాట్సాప్‌ గ్రూప్‌లో రచ్చ మాములుగా లేదు

మరిన్ని వార్తలు