ఇంగ్లండ్‌ క్రికెటర్‌ వలలో చిక్కుకున్న బ్రిటన్‌ ప్రధాని!

24 Mar, 2023 09:18 IST|Sakshi

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తన చర్యతో సోషల్‌ మీడియాలో మరోసారి వైరల్‌గా మారారు. టి20 వరల్డ్‌ ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్‌ జట్టుతో రిషి సునాక్‌ సరదాగా గడిపారు. తాను నివాసం ఉంటున్న 10 డౌనింగ్‌ స్ట్రీట్‌కు ఇంగ్లండ్‌ ఆటగాళ్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాడు. కెప్టెన్‌ బట్లర్‌ సహా సామ్‌ కరన్‌, డేవిడ్‌ మలాన్‌, ఫిల్‌ సాల్ట్‌, టైమల్‌ మిల్స్‌, రిచర్డ్‌ గ్లెసన్‌, క్రిస్‌ జోర్డాన్‌లు హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో ప్రధాని రిషి సునాక్‌ వారితో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడారు. ముందు బ్యాటింగ్‌లో కవర్‌ డ్రైవ్‌తో అలరించిన రిషి సునాక్‌ ఆ తర్వాత క్రిస్‌ జోర్డాన్‌ వలలో చిక్కుకున్నాడు. జోర్డాన్‌ బంతిని పుల్‌ చేయబోయి స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత  బౌలింగ్‌లో సామ్‌ కరన్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ సర్రీ క్రికెట్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసుకుంది.

ఇక టి20 ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్‌ జట్టును అభినందించడానికి ప్రధాని రిషి సునాక్‌ తన నివాసానికి ఆహ్వనించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. స్వతహగా క్రికెట్‌ అభిమాని అయిన రిషి సునాక్‌ తమ దేశం పొట్టి క్రికెట్‌లో వరల్డ్‌ ఛాంపియన్స్‌గా అవతరించడంతో వారిని సత్కరించాలని భావించారు. అందుకే ఆటగాళ్లకు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. కాగా గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి ఇంగ్లండ్‌ విశ్వవిజేతగా నిలిచింది.

మరిన్ని వార్తలు